- ఐటీ, ఈకామర్స్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్కు కూడా ఓకే
- కరోనా ఎఫెక్ట్ లేని ప్రాంతాలకు మాత్రమే పరిమితం
- గైడ్లైన్స్ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20 నుంచి వ్యవసాయం, ఐటీ, ఈకామర్స్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు, గుర్తించిన మార్కెట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. పబ్లిక్ ప్లేసులు, పని ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు పెట్టుకోవడం తప్పనిసరి అని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం శిక్షార్షమైన నేరమని స్పష్టం చేసింది. వీటిని అందరూ తప్పకుండా పాటించాలని, జిల్లా కలెక్టర్లు ఈ గైడ్ లైన్స్ సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించింది. ఈ గైడ్ లైన్స్ పాటించని వారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఫైన్లు, శిక్షలు విధించాలని ఆదేశించింది. ఈ నెల 20 నుంచి కరోనా ఎఫెక్ట్ లేని కొన్ని ప్రాంతాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.