కరోనా రిపోర్ట్ తెస్తేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీలోకి ఎంట్రీ

కరోనా రిపోర్ట్ తెస్తేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  అసెంబ్లీలోకి ఎంట్రీ
  • నెగెటివ్​ రిపోర్టుంటేనే అసెంబ్లీలోకి
  • కరోనా రూల్స్​ ప్రకారమే సమావేశాలు: స్పీకర్​ పోచారం

హైదరాబాద్​, వెలుగు: కరోనా రూల్స్​ ప్రకారమే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. నెగెటివ్​ రిపోర్ట్​ ఉంటేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ, కౌన్సిల్​లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, లా అండ్​ ఆర్డర్​, కరోనా నివారణ చర్యలపై శుక్రవారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్​లో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మార్షల్స్​, బందోబస్తు డ్యూటీలో ఉండే పోలీసులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఆవరణలో కరోనా ర్యాపిడ్​ టెస్టులు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్​ హాళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో రోజూ రెండు సార్లు శానిటైజేషన్​ చేయిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్​లతోనే హాజరుకావాలన్నారు.