
- మాస్కులు పెడ్తలేరు.. డిస్టెన్స్ పాటిస్తలేరు..
- మాల్స్, షాపుల్లో శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్లు పత్తాలేవ్
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు కిటకిట
- సంబురాలు, సమావేశాల్లో పొలిటికల్ పార్టీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒక దిక్కు రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. థర్డ్ వేవ్ స్టార్టయిందని హెల్త్ ఆఫీసర్లు ప్రకటించారు. అయినా చాలా మంది కరోనా రూల్స్ ఖాతరు చేస్తలేరు. మాస్కులు పెట్టుకుంటలేరు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తలేరు. మార్కెట్లు, థియేటర్లు, బస్టాండ్లు, బస్సులు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, బార్లలో గుంపు గుంపులుగా తిరుగుతున్నారు. ఎక్కడ కూడా శానిటైజర్ ఏర్పాట్లు కనిపించడం లేదు. థర్మల్ స్క్రీనింగ్ ముచ్చట్నే లేకుండాపోయింది. రాజకీయ పార్టీలు కూడా రూల్స్ను బ్రేక్ చేస్తూ సమావేశాలు, సభలు, సంబురాలు అంటూ ప్రజలను మోపుచేస్తున్నాయి.
బస్సుల్లో డిస్టెన్స్ లేదు.. శానిటైజర్లు లేవు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే జనంతో వారం పదిరోజుల నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు హాలిడేస్ ఉండటం, ఐటీ కంపెనీలు కూడా మళ్లీ వర్క్ ఫ్రం హోం ప్రకటించడంతో పెద్ద ఎత్తున జనం సిటీల నుంచి ఊర్లకు పయనమవుతున్నారు. అయితే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సోషల్ డిస్టెన్స్ ఏమాత్రం కనిపించడం లేదు. అనేక బస్సుల్లో కండక్టర్లు కూడా మాస్కులు లేకుండానే డ్యూటీలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో బస్సుల్లో శానిటైజర్లు పెట్టినా.. ఇప్పుడు పత్తాలేకుండా పోయాయి. ఫుల్ సీటింగ్ కెపాసిటీతోనే బస్సులు నడిపిస్తున్నారు.
షాపుల ముందు మార్కింగ్స్ ఏమాయె
గతంలో సోషల్ డిస్టెన్స్ కోసం మాల్స్, షాపులు, మార్కెట్ల ముందు రౌండ్ మార్కింగ్ వేసి అమలు చేసేవారు. ప్రస్తుతం అలాంటివి ఎక్కడా ఏర్పాటు చేయడం లేదు. శానిటైజర్లు పెట్టడంలేదు. థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు కనిపించడం లేదు. కరోనా రూల్స్ను ఎవరూ అమలు చేయడం లేదు. రైతు బజార్లు, చేపల మార్కెట్లు, రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, థియేటర్లు జనంతో నిండిపోతున్నాయి.
సంబురాలు, సమావేశాల్లో రాజకీయ పార్టీలు
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కరోనా రూల్స్ను తుంగలో తొక్కుతున్నాయి. సమావేశాలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు నిర్వహిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నా.. సంబురాలను సంక్రాంతి వరకు పొడిగించింది. వివిధ కార్యక్రమాలు అంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జనాన్ని పోగు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేపడుతున్నాయి. ఇటీవల సీపీఎం నేషనల్ కాన్ఫరెన్స్ మూడు రోజులపాటు నిర్వహించారు. ఏఐవైఎఫ్ నేషనల్ కాన్ఫరెన్స్లో నేషనల్ లీడర్లతోపాటు, స్టేట్ లీడర్లు పాల్గొన్నారు.