- నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘటన
హాలియా, వెలుగు: ట్రాక్టర్లో కరెంట్ పోల్స్ తీసుకెళ్తుండగా, అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఈదుల సత్యనారాయణ(45), బొంత సైదులు(43) కూలీలుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే విద్యుత్ స్తంభాలను పోచంపల్లి సబ్ స్టేషన్ నుంచి కాల్వపల్లికి ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా, ముల్కలపల్లి గ్రామ శివారులో టాక్టర్ ట్రాలీలో ఉన్న పోల్స్ ఒక వైపునకు జరుగుతున్నాయని కూలీలు అరవగా, ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఇద్దరు కూలీలపై పోల్స్ పడడంతో అక్కడిక్కడే చనిపోయారు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు, మల్లేపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకన్న పరిశీలించారు. మృతుల భార్యలు బొంత పార్వతమ్మ, ఈదుల పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
