ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచనలు
అన్ని రాష్ట్రాల హెల్త్ డిపార్ట్మెంట్లతో వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో వచ్చే నెలలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జనవరి మూడో వారం నాటికల్లా వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు తొలిదశ వ్యాక్సిన్ డోసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. దీనిపై కేంద్ర హెల్త్ మినిస్ట్రీ మంగళవారం అన్ని రాష్ట్రాల హెల్త్డిపార్ట్మెంట్ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టీకా స్టోరేజీ, పంపిణీకి సంబంధించి.. ఏమేం చేయాలి, ఏయే ఏర్పాట్లు అవసరమన్న అంశాలను రాష్ట్ర అధికారులకు వివరించింది.
ఈ మీటింగ్కు సంబంధించి రాష్ట్ర అధికారులు చెప్పిన వివరాల మేరకు.. వచ్చే నెల 15వ తేదీ నాటికి తొలిదశ వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. నెలాఖరుకల్లా పంపిణీ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. అలాగే ఈ నెల చివర్లో ప్రధాని మోడీ అధికారికంగా టీకా పంపిణీని ప్రారంభించే అవకాశముందని అధికారులు తెలిపారు.
కోవిన్ సాఫ్ట్వేర్ సాయంతో..
కరోనా వ్యాక్సిన్ల మెయింటెనెన్స్, డిస్ట్రిబ్యూషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘కోవిన్’ సాఫ్ట్ వేర్ను రూపొందించింది. రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వారందరి వివరాలు సేకరించి సాఫ్ట్వేర్లో, కేంద్ర వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో పేరు ఉంటేనే వ్యాక్సిన్ వేస్తారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిన్ సాఫ్ట్వేర్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అందుకు వారి ఐడెంటిటీని వాడొచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి ఆధార్ అవసరం లేదని, సరైన ఇతర ఐడెంటిటీ ఏదైనా సరేనని అధికారులు చెప్తున్నారు. అయితే ఇలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను మెడికల్ డిపార్ట్మెంట్ మరోసారి తనిఖీ చేస్తుంది. ఇక టీకా కోసం స్పాట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్కు అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది.
ఒక్కో వ్యాక్సిన్ సెంటర్లో రెండు టీమ్లతో..
ఒక్కో సెంటర్లో 100 మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందులో 2 టీమ్లు పనిచేస్తాయి. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారి వివరాలను ఒక టీం చెక్ చేసి, సర్టిఫై చేస్తుంది. మరో టీంలో ఐదుగురు ఉంటారు. ఒక వ్యాక్సినేటర్ ఆఫీసర్, డాక్టర్, నర్సు, ఏఎన్ఎంతోపాటు మరొక హెల్పర్ ఉండే టీమ్.. వ్యాక్సిన్ వేస్తుంది. సదరు వ్యక్తి తర్వాత అరగంటపాటు కచ్చితంగా వ్యాక్సిన్ కేంద్రం వద్దనే ఉండాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, సమస్యలు లేవనుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లడానికి పర్మిషన్ ఇస్తారు.