హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండగా సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో14 కేసులు నమోదవగా.. హైదరాబాద్లో 6 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఐసీయూతో పాటు, 5 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేశారు. వెంటిలేటర్, ఆక్సిజన్ , ఆర్టీపీసీఆర్ కిట్లు, మెడిసిన్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రిలో గత కరోనా టైంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు ప్రస్తుతం రెడీ ఉన్నాయని సూపరిండిండెంట్ రాజారావు తెలిపారు.
ఫీవర్ ఆస్పత్రిలో 32 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రిలో , ఇండ్లలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జనం బయటకు వెళ్లేటప్పడు మాస్కులు ధరించాలని, వీలైనన్ని సార్లు చేతులను సబ్బు, శానిటైజర్తో కడగాలని పేర్కొన్నారు. జ్వరం దగ్గు, జలుబుతో బాధపడేవారికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.