
- పెద్ద కంపెనీలే కొంత బెటర్
వెలుగు బిజినెస్ డెస్క్: దేశంలోని చిన్న వ్యాపారాలపై కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. మన ఎకానమీలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఈ వ్యాపారాలు చిక్కుల్లో పడ్డాయని సొసైటి జనరలె రిపోర్టు వెల్లడించింది. పెద్ద వ్యాపారాల పరిస్థితే కొంత బెటర్గా ఉందని ఆ రిపోర్టు పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజీలు పూర్తి స్థాయిలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజస్ (ఎంఎస్ఎంఈ)కు ఉపయోగపడలేదని ఈ రిపోర్టులో సొసైటీ జనరలె ఎకానమిస్ట్ కునాల్ కుందు తెలిపారు. చిన్న బిజినెస్లకు తగినంత లిక్విడిటీ అందడం లేదని, మారటోరియం కూడా పెద్దగా ప్రయోజనం కలిగించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంఎస్ఎంఈలలో పనిచేసే చాలా మందికి ఉపాధి పోయిందని అన్నారు.మన దేశంలోని ఎంఎస్ఎంఈలలో 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయం కాకుండా మన దేశంలో ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నది ఎంఎస్ఎంఈలే. కాబట్టి, ఇవి రికవరీ అయితేనే మళ్లీ చాలా మందికి ఉపాధి దొరుకుతుందని, ఫలితంగా దేశంలో మళ్లీ కన్జంప్షన్ పుంజుకుంటుందని కునాల్ కుందు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సేల్స్ ఉద్యోగుల ఖర్చు ఎక్కువ. కానీ, ఈ రేషియో 2020లోని రెండో, నాలుగో క్వార్టర్లలో బాగా తగ్గిపోయింది. పెద్ద కంపెనీలకు స్టాఫ్ కాస్ట్ టు సేల్స్ రేషియో ఇదే టైములో 5 శాతం మాత్రమే తగ్గింది. చాలా మంది ఉద్యోగులను తీసివేసినా, ఎంఎస్ఎంఈల మార్జిన్స్ ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఇన్పుట్ కాస్ట్లు, వడ్డీలు పెరిగాయి. పన్నుల విషయంలోనూ ఎంఎస్ఎంఈలు ఇబ్బందులెదుర్కొంటున్నాయి. ఇన్వాయిస్ రెయిజ్ చేసిన వెంటనే జీఎస్టీని కట్టాల్సి వస్తోంది.