- 355 టీఎంసీల లైవ్ స్టోరేజ్కుగానూ.. ఉన్నది 44.53 టీఎంసీలే
- సీడబ్ల్యూసీ రిపోర్ట్లో వెల్లడి.. దేశంలోనే తెలంగాణలో అత్యల్ప స్టోరేజ్
- సాగర్లో 6.5 టీఎంసీలే వాడుకునే వీలు.. శ్రీరాంసాగర్లోనూ 16 టీఎంసీలే
- ఆ 2 ప్రాజెక్టుల కిందే రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల దాకా సాగు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు దినదినం దీనస్థితిలోకి జారుకుంటున్నాయి. వర్షాలుపడక.. వరదలు లేక తడారిపోతున్నాయి. దేశంలోనే అత్యల్పంగా నీళ్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 166 ప్రాజెక్టుల్లో లైవ్ స్టోరేజ్పై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇచ్చిన రిపోర్టులో కలవరపెట్టే అంశాలు వెల్లడయ్యాయి. గతవారంతో పోలిస్తే ప్రాజెక్టుల్లోని జలాలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో సీడబ్ల్యూసీ 8 ప్రధాన ప్రాజెక్టులను మానిటర్ చేస్తున్నది.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల, కడెం, లోయర్ మానేరు, నిజాంసాగర్, సింగూరు, మూసీ ప్రాజెక్టుల డేటానే సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకున్నది. సీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఆ 8 ప్రాజెక్టుల్లోని లైవ్ స్టోరేజ్ సుమారు 355 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 44.53 టీఎంసీల జలాలే ఉన్నాయి. అంటే లైవ్స్టోరేజ్లో ఉన్న నీళ్లు దాదాపు 13 శాతం. ఇది దేశంలోనే అత్యల్ప లైవ్ స్టోరేజ్అని సీడబ్ల్యూసీ తన రిపోర్టులో వెల్లడించింది. గతవారం 48 టీఎంసీల జలాలుండగా.. 3 టీఎంసీలకుపైగా నీళ్లు తగ్గిపోయాయి. నిరుడు ఇదే సమయానికి ఆ 8 ప్రాజెక్టుల్లో 106 టీఎంసీల నీళ్లుండగా.. ఇప్పుడు అందులో సగం కూడా ప్రాజెక్టుల్లో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
సాగర్లో పడిపోతున్నయ్..నాగార్జునసాగర్ ప్రాజెక్టులో లైవ్స్టోరేజ్ 180
టీఎంసీలుకాగా.. ప్రస్తుతం కేవలం 6.5 టీఎంసీల నిల్వ మాత్రమే ఉండడం కలవరపరుస్తున్నది. తెలంగాణకు అత్యధికంగా ఈ ప్రాజెక్టు ద్వారానే యాసంగి, వానాకాలం సీజన్లకు సాగునీటిని ఇస్తుంటారు. నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో లైవ్స్టోరేజ్లో 45.41 టీఎంసీల నీళ్లుండగా.. ఇప్పుడు అందులో కేవలం 14 శాతమే నీళ్లున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణకు అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదీ అదే పరిస్థితి. ఆ ప్రాజెక్టులో 66 టీఎంసీల లైవ్స్టోరేజ్కుగానూ.. ప్రస్తుతం కేవలం 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయి.
వరద రాకుంటే ఎట్ల..
మన దగ్గర వర్షాలు లేకున్నా.. ఎగువన వర్షాలు పడుతుండడంతో వరద వస్తుందేమోనన్న ఆశ కొంచెం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం నుంచి ఎగువన కూడా వర్షాలు తక్కువే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పుడిప్పుడే కృష్ణాలో వరద మొదలవుతున్న తరుణంలోనే వర్షాలు తగ్గిపోతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెలంతా వర్షాభావ పరిస్థితులే ఉంటాయన్న అంచనాలతో.. వరదలూ తక్కువే ఉంటాయన్న అంచనాకు అధికారులు వస్తున్నారు. అదే జరిగితే మన రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు వరదలు రావని, ఇరిగేషన్కు అత్యంత గడ్డుకాలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరుడు ఇదే టైంకు ఈ ప్రాజెక్టులోనూ మెండుగా
నీళ్లున్నాయి. గత ఏడాది వానాకాలంలో 20 టీఎంసీల వరకు వాటర్ ప్రాజెక్టులో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల కిందే మన రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టులు కూడా వరద తాకిడి కోసం వేచి చూస్తున్నాయి. జూరాల ప్రాజెక్టులో లైవ్స్టోరేజ్ 6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం కేవలం 2 టీఎంసీలే ఉన్నాయి. మూసీలో 4.3 టీఎంసీలకుగానూ.. 3.4 టీఎంసీలు, సింగూరులో 29 టీఎంసీలకుగానూ 4.5 టీఎంసీలు, కడెంలో 4.8 టీఎంసీలకుగానూ 0.46 టీఎంసీలు, లోయర్ మానేరులో 22 టీఎంసీలకుగానూ 5.7 టీఎంసీలు, నిజాంసాగర్లో 17 టీఎంసీలకుగానూ 6.6 టీఎంసీల నీళ్లున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుది మరీ దయనీయమైన పరిస్థితి. ఆ ప్రాజెక్టులో లైవ్స్టోరేజ్ 212 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 38.66 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అది డెడ్స్టోరేజ్లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి చుక్క నీరు కూడా తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
మన లెక్కకు.. సీడబ్ల్యూసీ లెక్కకు ఫరక్
దేశంలోని ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్ఎస్ఎంఎస్) ద్వారా సీడబ్ల్యూసీ గణాంకాలను ఇస్తుంటుంది. మన రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులనే ఆర్ఎస్ఎంఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నది. అదే సమయంలో మన అధికారులు కూడా రెండు మూడేండ్ల కిందట ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్(ఐడీఎస్ఎస్)ను అభివృద్ధి చేసింది. ఆర్ఎస్ఎంఎస్లో సీడబ్ల్యూసీ చూపిస్తున్న డేటాకు.. ఐడీఎస్ఎస్లోని డేటాకు ఫరక్ ఉంటున్నది. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఐడీఎస్ఎస్ ప్రకారం లైవ్స్టోరేజ్ 200 టీఎంసీలు కాగా.. సీడబ్ల్యూసీ మాత్రం కేవలం 180 టీఎంసీలుగానే చూపిస్తున్నది. లైవ్స్టోరేజ్లో 20 టీఎంసీలున్నట్టు మన లెక్కలు చెప్తుండగా.. సీడబ్ల్యూసీ మాత్రం కేవలం 6.5 టీఎంసీలే ఉన్నాయని స్పష్టం చేస్తున్నది. అదే సమయంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యమే 80 టీఎంసీలైతే.. ఆ మొత్తాన్నీ లైవ్స్టోరేజ్గానే సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటున్నది.
