
కమ్యూనిటీలోకి చొచ్చుకెళ్తోందంటున్న డాక్టర్లు
కరోనా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఎవరికి.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ విధంగా అంటుకుంటుందో తెలియట్లేదు. అసలు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి, ఇంట్లోంచి బయటికే వెళ్లని వారికి కూడా ఉన్నట్టుండి వైరస్ లక్షణాలు బయటపడుతున్నయి. రెండు వారాలుగా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని కాంటాక్ట్ ట్రేసింగ్ డ్యూటీ చేస్తున్న అధికారులు, డాక్టర్లు చెబుతున్నారు. కరోనా చాప కింద నీళ్లలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తోందని, కమ్యూనిటీలోకి మెల్లగా చొచ్చుకుపోతోందని వీళ్లు అంటున్నారు.
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ మెల్లగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తోంది. అసలు ఎవరి ద్వారా ఎవరికి వైరస్ సోకిందన్న లింకు కూడా తెలియకుండా పోతోంది. గత వారంలో రాష్ట్రంలో 302 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోనే 199 కేసులు వచ్చాయి. వీళ్లలో చాలా మందికి వైరస్ ఎట్లా అంటుకుందో లింకు దొరకడం లేదు. ముషీరాబాద్లో బ్యాంగిల్ స్టోర్లో పనిచేసే ఓ మహిళకు, అదే ఏరియాలోని మరో 3 కేసులకు సంబంధించి వైరస్ ఎట్లా వచ్చిందో గుర్తించలేకపోయారు. ఇటీవల అశోక్నగర్లో ఐదారు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరికి, ఇన్ఫెక్షన్స్ సోర్స్ తెలియలేదు. జియాగూడకు చెందిన ఓ రిటైర్డ్ ఎంప్లాయి ఇటీవల పురానాపూల్లో మార్కెట్కు వెళ్లొచ్చాడు. రెండ్రోజులకే వైరస్ సింప్టమ్స్ మొదలైనయి. టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది. మార్కెట్లో ఎవరి నుంచి వైరస్ అంటుకుందో తెలియలేదు. సైదాబాద్ కుర్మాగూడలో ఓ ఇంట్లో పనిచేసే మహిళకు వైరస్ సోకింది. ఆమెకు వైరస్ ఎట్లొచ్చిందో గుర్తించలేకపోయారు. ఇట్లా కరోనా కేసులు, కాంటాక్ట్స్ లింక్ దొరకకపోవడంతో సర్కారు అలర్టయింది. ట్రేసింగ్ ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. లింకు తెలియకుండా వైరస్ వ్యాపిస్తున్నందున ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది.
ఎక్కువ సంఖ్యలో ప్రైమరీ కాంటాక్ట్స్
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వైరస్ సోకుతోంది. ఒక్క ముషీరాబాద్ డివిజన్లోనే ఇలాంటివి 3 కేసులు నమోదయ్యాయి. బోరబండ బంజారానగర్లో ఓ మటన్ వ్యాపారికి, ధూల్ పేటలోని బంగ్లాదేశ్ బస్తీలో కిరణా షాపు ఓనర్కు కరోనా అంటుకుంది. వారు సామగ్రి కోసం వెళ్లే హోల్సేల్ షాపుల్లో కలిసిన వారి వల్ల వీరికి వచ్చిందా, వీరి వల్ల ఆ హోల్సేల్ షాపుల వారికి వచ్చిందా తెలియడం లేదు. ఈ చిన్న షాపులకు వచ్చే కస్టమర్లకూ వైరస్ వ్యాపిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో వారిని కలిసే నేపథ్యంలో కాంటాక్ట్లను గుర్తించడం కష్టమవుతోందని అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ సడలింపులతో జన సంచారం పెరిగింది. ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్కు పాజిటివ్ వస్తే.. ఆయనతో పనిచేసే 18 మందిని, మరోచోట ఎస్సైకి పాజిటివ్ వస్తే ఆయనతో పనిచేసే 35 మందిని క్వారంటైన్ చేశారు. ఆఫీసుల్లోనూ మాస్కులు ధరించడం మంచిదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
సోర్స్ దొరుకుతలేదు
ఇదివరకు మెజారిటీ కేసుల్లో వైరస్ ఎవరి నుంచి అంటుకుందో తెలిసేదని, ఇప్పుడా పరిస్థితి లేదని గ్రేటర్కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘‘చాలా కేసుల్లో ఇన్ఫెక్షన్ సోర్స్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నం. కొంతమందికి మార్కెట్లు, హాస్పిటల్స్ కు వెళ్లిన హిస్టరీ ఉంటే.. అక్కడే ఎవరి నుంచో అంటుకుని ఉంటుందని భావిస్తున్నం. కొందరికి అలాంటి హిస్టరీ కూడా ఉండట్లేదు. ఇంట్లోనే ఉండే 70, 80 ఏండ్ల వాళ్లకూ పాజిటివ్ వస్తోంది. వాళ్ల ఇండ్లలో అందరికీ నెగెటివ్ ఉంటోంది. కొంద రేమో హిస్టరీ చెప్పకుండా దాచిపెడుతున్నారు. సర్వే కోసం వెళ్లినప్పుడు వైరస్ లక్షణాలున్నా చెప్పట్లేదు. వాళ్లంతట వాళ్లే ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు. తగ్గకపోతే ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్తున్నారు. ఆ తర్వాతే మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అట్లాంటి వాళ్లకు పాజిటివ్ వస్తే ప్రైమరీ కాంటాక్ట్స్ను గుర్తించడం కష్టమవుతోంది’’ అని వివరించారు.
దవాఖానాలతో జాగ్రత్త
మలక్ పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకున్న ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో డయాలసిస్ టెక్నీషియన్లందరికీ టెస్టులు చేయించారు. ఎవరికీ కరోనా సోకలేదు. ఆ ముగ్గురికి వైరస్ ఎట్లా సోకిందో తెలియలేదు.
మియాపూర్లో చుట్టాల ఇంటికొచ్చిన ఓ జంట కరోనా వచ్చింది. వాళ్లు ఓ హాస్పిటల్కు వెళ్లారని, అక్కడే వైరస్ సోకి ఉంటుందనుకుంటున్నారు.
సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల వైరస్ సోకింది. ఆయనకు ఎలా సోకిందో తెలుసుకునే క్రమంలో.. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కు చెకప్ కోసం వచ్చినట్టు గుర్తించారు. అక్కడే సోకి ఉంటుందని భావిస్తున్నారు.
ఇలా లింకు దొరకని చాలా కేసుల ట్రావెల్ హిస్టరీలో హాస్పిటల్ ఉంటే.. ఆ హాస్పిటల్లోనే ఎవరి నుంచో వైరస్ అంటుకుని ఉంటుందని నిర్ధారణకు వస్తున్నారు. లాక్ డౌన్ సడలింపులతో వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.
జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్, బంజారాహిల్స్లోని మరో హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. వాళ్లకు ఎట్లొచ్చిందో తెలియాల్సి ఉంది.
ఆయనకు ఎవరి నుంచి అంటుకుందో!
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఐటీ సెల్లో డ్యూటీ చేసే ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అంబర్పేట ఏరియాలో ఉండే ఆయనకు వైరస్ ఎవరి నుంచి అంటుకుందో తెలియదు. ఇప్పటికే ఆయన నుంచి కుటుంబంలోని ఇద్దరికి వ్యాపించింది.
75 ఏండ్లు, ఇంట్లనే ఉన్నడు.. అయినా వచ్చింది
చార్మినార్ ఏరియాలో 75 ఏండ్ల పెద్దాయన రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. సడన్గా జ్వరం, ఆయాసం రావడంతో టెస్టులు చేయిస్తే.. కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఫ్యామిలీలో అందరికీ టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. మరి ఆయనకు వైరస్ ఎలా వచ్చిందో తెలియలేదు.