
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దాంతో భక్తులు లేక తిరుమల బోసిపోయింది. కానీ, ఓ జంట మాత్రం అనుకున్న ముహూర్తానికే శ్రీవారి సన్నిధిలో ఒక్కటైంది. కరోనా విజృంభణ నేపథ్యంలో శుక్రవారం నుంచి వారం రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ అధికారులు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో గురువారం మధ్యాహ్నం నుంచే భక్తులను తిరుమలకు అనుమతించకుండా ఘాట్రోడ్లను మూసేశారు. దీంతో శుక్రవారం ఉదయానికే తిరుమల బోసిపోయింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లెకు చెందిన ఓ పెళ్లి బృందం శుక్రవారం సాయంత్రం అలిపిరికి చేరుకుంది. కానీ అక్కడి సిబ్బంది మాత్రం తిరుమలకు ఎవరికీ అనుమతి లేదంటూ తెలిపారు. అయితే ఆ పెళ్లి బృందం మాత్రం తాము ముందుగానే కల్యాణానికి నమోదు చేసుకున్నామని తెలిపారు. తాము శుక్రవారం రాత్రి 9:30 గంటలకు కల్యాణవేదికలో వివాహం చేసుకునేందుకు నమోదు చేసుకున్నట్లు తెలుపుతూ తమ దగ్గర ఉన్న పత్రాలను చూపారు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులతో కూడిన వాహనాన్ని మాత్రమే తిరుమలకు ప్రత్యేకంగా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఇక చేసేదేమిలేక రాత్రి 8 గంటలకు కొద్దిమంది మాత్రమే తిరుమల చేరుకున్నారు. వారు అనుకున్నట్లుగానే రాత్రి 9.30 గంటల ముహూర్తానికి వివాహ బంధంతో ఆ జంట ఒక్కటయ్యారు. తిరుమల మొత్తం బోసిపోయిన తరుణంలో వీరు మాత్రం ప్రత్యేకంగా కొండపై పెళ్లి చేసుకోవడం విశేషం.
For More News..