Liquor Scam : సిసోడియా బెయిల్ పిటీషన్ తిరస్కరణ

Liquor Scam : సిసోడియా బెయిల్ పిటీషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ తిరస్కరించింది రౌస్ అవెన్యూ కోర్టు. నాపై విచారణ పూర్తయ్యిందని.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మార్చి 31వ తేదీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఇంకా పూర్తి కాలేదని.. ఈడీ కూడా దర్యాప్తు చేస్తుందని.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఇంకా సమయం పడుతుందని సీబీఐ స్పష్టం చేసింది.

ఢిల్లీ స్కాంలో కేసులో విచారణ పూర్తి కాకుండా బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది సీబీఐ. కీలక పాత్రధారిగా సిసోడియా ఉన్నారని.. ఈ లావాదేవీల్లో విచారించాల్సిన వారు ఇంకా ఉన్నారని.. ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు స్పష్టం చేసింది సీబీఐ. ఇదే సమయంలో సిసోడియా తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇప్పటికే సీబీఐ, ఈడీలు.. లిక్కర్ స్కాంలో కస్టడీలోకి తీసుకుని విచారించాయని.. కొత్తగా రాబట్టాల్సిన అంశాలు ఏమీ లేవని.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సీబీఐ, ఈడీలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని.. ఎప్పుడు పిలిచినా హాజరవుతారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తారని కోర్టుకు తెలిపారు సిసోడియా తరపు లాయర్లు. 

సిసోడియా బెయిల్ పిటీషన్ పై రెండు వర్గాల వాదనలు విన్న రౌన్ అవెన్యూ కోర్టు.. బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. విచారణను ఏప్రిల్ 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు కస్టడీ పొడిగించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు సిసోడియా.