
పూజా భలేకర్ మెయిన్ లీడ్ లో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన "లడకీ" (అమ్మాయి) సినిమాపై కోర్టు స్టే విధించింది. ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ నిర్మాత కె.శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జబర్దస్త్ సుధీర్ తో "సాఫ్ట్ వేర్ సుధీర్" సినిమాను నిర్మించిన తాను... వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నానని, ఈ మేరకు ఆయన్ని కలిసినట్టుగా నిర్మాత కె.శేఖర్ రాజు తెలిపారు. అయితే తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ .. ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకుంటూ వస్తున్నారని శేఖర్ రాజు వివరించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, సరిగ్గా సమాధానం కూడా చెప్పడంలేదని, దాంతో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో కోర్టును ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. దీంతో 'లడకీ" సినిమా ప్రదర్శనను అన్ని భాషలలో నిలుపుదల చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఈ నెల 14న ఆర్డర్స్ జారీ చేసిందని పేర్కొన్నారు. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్ లో సినిమాను అమ్మడానికి కానీ బదిలీ చేయడానికి, కానీ ప్రదర్శించడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన తెలిపారు.