
- నిందితుడు నిర్మల్ కోర్టులో టైపిస్ట్
ఆదిలాబాద్, వెలుగు: న్యాయస్థానంలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని గురువారం ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ బి.సునీల్ కుమార్ తో కలిసి డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ నగర్ కాలనీకి చెందిన మహ్మద్ తాజోద్దీన్ అలియాస్ షాకీర్ నిర్మల్ జిల్లా కోర్టులో టైపిస్ట్గా పని చేస్తున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలో పలువురికి ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానంటూ రూ. లక్షన్నర వసూలు చేశాడని పేర్కొన్నారు.
పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఖాళీ జాగ చూపించి నకిలీ జిరాక్స్ పత్రాలు అందజేసి మోసం చేశాడని బాధితురాలు మంజుల ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గురువారం భైంసాలో అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. గతంలో 170 సర్వే నంబర్లో స్థలాలను నకిలీ పత్రాలు చూపించి రిజిస్ట్రేషన్ చేపిస్తానని మోసం చేసినట్లు తేలిందన్నారు. బాధితులు పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.