
నిజామాబాద్, వెలుగు : సెంట్రల్ గవర్నమెంట్ గతేడాది జూలై 1 నుంచి అమలు చేస్తున్న కొత్త న్యాయ చట్టాలపై జర్నలిస్టులు అవగాహన పెంచుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీ సాయి చైతన్య సూచించారు. బుధవారం శ్రీరామ గార్డెన్లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన ప్రోగ్రామ్ లో ఆయన ప్రసంగించారు. గతంలో ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల పరిధిలో కేసుల విచారణ నడిచేదని, వాటిని రద్దు చేసిన కేంద్ర సర్కార్ మూడు రకాల చట్టాలు అమల్లోకి తెచ్చిందన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని సీపీ కోరారు. కొత్తగా వచ్చిన ఈ మూడు చట్టాల పరిధిలోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.
క్రైమ్ వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మైనర్లకు సంబంధించిన కేసుల్లో వారి పేర్లుగాని, కుటుంబీకుల పేర్లుగాని రాయకూడదన్నారు. సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ఫొటోలు, వీడియోలకు మస్ట్గా సంబంధీకుల అనుమతి పొందాలన్నారు. ఆధునిక యుగంలో ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు చూపే అవకాశముందని ప్రతి అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ అంశాలు వివరించారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్అలీ, రూరల్ సీఐ ఆరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.