కొత్త చట్టాలపై అవగాహన తప్పనిసరి : సీపీ సాయి చైతన్య

కొత్త చట్టాలపై అవగాహన తప్పనిసరి : సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, వెలుగు : సెంట్రల్ గవర్నమెంట్ గతేడాది జూలై 1 నుంచి అమలు చేస్తున్న కొత్త న్యాయ చట్టాలపై జర్నలిస్టులు అవగాహన పెంచుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీ సాయి చైతన్య సూచించారు. బుధవారం శ్రీరామ గార్డెన్​లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన ప్రోగ్రామ్ లో ఆయన ప్రసంగించారు. గతంలో ఐపీసీ, సీఆర్​పీసీ చట్టాల పరిధిలో కేసుల విచారణ నడిచేదని, వాటిని రద్దు చేసిన కేంద్ర సర్కార్​ మూడు రకాల చట్టాలు అమల్లోకి తెచ్చిందన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్​ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని సీపీ కోరారు. కొత్తగా వచ్చిన ఈ మూడు చట్టాల పరిధిలోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.

క్రైమ్ వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మైనర్లకు సంబంధించిన కేసుల్లో వారి పేర్లుగాని, కుటుంబీకుల పేర్లుగాని రాయకూడదన్నారు. సోషల్​ మీడియాలో రిలీజ్ చేసే ఫొటోలు, వీడియోలకు మస్ట్​గా సంబంధీకుల అనుమతి పొందాలన్నారు. ఆధునిక యుగంలో ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు చూపే అవకాశముందని ప్రతి అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. పవర్ పాయింట్​ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ అంశాలు వివరించారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకట్​రెడ్డి, వెంకటేశ్వర్​రెడ్డి, శ్రీనివాస్​, మస్తాన్​అలీ, రూరల్​ సీఐ ఆరీఫుద్దీన్​ తదితరులు పాల్గొన్నారు.