ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సీపీగెట్ పరీక్షలు.. జూన్ 18 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సీపీగెట్ పరీక్షలు.. జూన్ 18 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • నెల రోజులు ఆలస్యంగా పీజీ అడ్మిషన్లు 
  • నోటిఫికేషన్ రిలీజ్ చేసిన బాలకిష్టారెడ్డి, ఎం.కుమార్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సులైన ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంసీజే, ఎంఈడీ, ఎంపీడీఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) పరీక్షలు ఆగస్టు ఫస్ట్ వీక్​లో నిర్వహించనున్నారు. ఈ నెల 18 నుంచి సీపీగెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. శుక్రవారం (జూన్తె 13) లంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో సీపీగెట్–2025 నోటిఫికేషన్ ను కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సీపీగెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కుమార్ రిలీజ్ చేశారు. 

సీపీగెట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, జేఎన్టీయూహెచ్ లోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. జూన్ 18 నుంచి జులై 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక సబ్జెక్టుకు జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.600  ఫీజు ఉంటుందని, రెండో సబ్జెక్టుకు రూ.450 చొప్పున ఫీజులు ఉండనున్నాయి. అభ్యర్థులు రూ.500 ఫైన్​తో జులై 24 వరకు, రూ.2 వేల ఫైన్ తో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలను  https://cpget.tsche.ac.in, http://www.ouadmissions.com వెబ్ సైట్లు పెట్టినట్టు అధికారులు ప్రకటించారు. 

తెలంగాణేతర విద్యార్థుల కోసం 20% సీట్లు

 గతేడాది 297 కాలేజీల్లో 46,742  సీట్లు ఉండగా, ప్రస్తుతం మరో ఏడాది నాలుగు వేల వరకు సీట్లు పెంచినట్టు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చెప్పారు. తెలంగాణేతర విద్యార్థుల కోసం 20% సీట్లను నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా (ఎన్​ఐక్యూ)  కింద కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. పీడబ్ల్యూడీ రిజర్వేషన్లను ఈ ఏడాది మూడు శాతం నుంచి ఐదు శాతం పెంచి అమలు చేయబోతున్నట్టు వివరించారు.  సమావేశంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూబ్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, శాతవాహన వర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, మహిళా వర్సిటీ వీసీ సూర్యధనుంజయ్, సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తేడాది 46 శాతం సీట్ల భర్తీ

రాష్ట్రవాప్తంగా గతేడాది 297 పీజీ కాలేజీల్లో 46,742 సీట్లు ఉండగా కేవలం 21,560 (46.12%) సీట్లు మాత్రమే నిండాయి. దీంట్లో సర్కారు కాలేజీల్లో 4518, క్యాంపస్/ వర్సిటీ అనుబంధ కాలేజీల్లో 8,087 సీట్లు నిండగా, ప్రైవేట్​ కాలేజీల్లో 12,643 సీట్లు భర్తీ అయ్యాయి. అత్యధికంగా ఓయూ పరిధిలో 89,936 మంది, కేయూ పరిధిలో 4,307 మంది చేరారు. 

గతేడాది అత్యధికంగా ఎంకామ్ లో 2,256 మంది,  ఎంఎస్సీ బాటనీలో 2,028 అడ్మిషన్లు తీసుకున్నారు. కాగా, గతేడాది మే నెలలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జులై ఫస్ట్ వీక్​లో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ లో దరఖాస్తుల మొదలుపెట్టి ఆగస్టులో ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఓయూ అధికారుల మధ్య సమన్వయలోపంతో నెల రోజులు పీజీ ప్రవేశాలు ఆలస్యం కానున్నాయి.