
- పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రభుత్వం మావోయిస్టులతో ఎందుకు జరపట్లే...
- సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి
కరీంనగర్, వెలుగు : మావోయిస్ట్లను అంతం చేయాలని మోదీ, అమిత్షా కంకణం కట్టుకున్నారని, ప్రశ్నించే గొంతులు ఉండొద్దనే ఆపరేషన్ కగార్ ప్రారంభించారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. హత్యలతో మావోయిజం పోదని, మావోయిస్ట్లను సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలని సూచించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్న కేంద్రం.. మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. తాము చర్చలకు సిద్దమేనని మావోయిస్టులు ప్రకటిస్తుంటే... కేంద్ర ప్రభుత్వం మాత్రం వారిని కాల్చి చంపుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధ పాలన సాగిస్తోందని విమర్శించారు.
ప్రధాని మోదీ నియంతృత్వ పోకడతో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ, దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునేందుకే జనగణన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పైడిపల్లి రాజు, బండ రాజిరెడ్డి పాల్గొన్నారు.