
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశధార వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని హిమాయత్ నగరలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అభ్యంతరాలు లేకుండా ప్రాజెక్టులను కట్టుకుంటే మంచిదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు.
కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారని, వెనకబడిన ప్రాంతాలకు నీరు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించారు. కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాలు రెండుగా విడిపోయాయని, ఎవరికి నష్టం లేని పద్ధతిలో పరిష్కారం చేసుకుంటే మంచిదని సూచించారు.