మోడీది భస్మాసుర హస్తం

మోడీది భస్మాసుర హస్తం
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

శాంతినగర్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోడీది భస్మాసుర హస్తమని, ఆయనను ఎవరు కలిసినా భూస్థాపితం అవుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్  పట్టణంలో ఇటీవల మరణించిన సీపీఐ కార్యకర్త రాజ్ కమార్  కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన కూతురిని లిక్కర్  స్కామ్  నుంచి కాపాడుకునేందుకు మోడీతో కేసీఆర్​ చేతులు కలిపాడని తెలిపారు. మోడీని ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసినా ఓటమి తప్పదన్నారు. రాజకీయ పార్టీలు అహంకారం పక్కన పెట్టి ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని హితవు పలికారు.

కాంగ్రెస్​తో కలిసి సమస్యలు పరిష్కరిస్తాం

నాగర్ కర్నూల్ టౌన్ : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని సాయి గార్డెన్ లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డిలకు సీపీఐ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్  పార్టీతో మంచి స్నేహం ఉందన్నారు. కార్మికులు, కర్షకులు, పేదలను ఆదుకునేందుకే తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, వెంకటయ్య, కేశవ గౌడ్, ఇందిర, పల్లె నర్సింహ, శివశంకర్ పాల్గొన్నారు.