
- యాషెస్తో మెగా సమరం షురూ
- 2021 జూన్లో ఫైనల్
2003లో మొదలుపెట్టిన టెస్ట్ చాంపియన్షిప్ స్థానంలో ఐసీసీ కొత్తగా ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్’ను రూపొందించింది. 2019–2021 వరకు జరిగే ఈ చాంపియన్షిప్కు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ తొలి మ్యాచ్తో తెరలేవనుంది. 12 టెస్ట్ నేషన్స్ నుంచి 9 మాత్రమే అంటే.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక మాత్రమే ఈ చాంపియన్షిప్లో పాల్గొంటాయి. అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, జింబాబ్వేకు అవకాశం ఇవ్వలేదు. రెండేళ్ల పాటు జరిగే ఈ చాంపియన్షిప్ ఫార్మాట్ కూడా భిన్నంగా ఉంటుంది. సిరీస్కు కాకుండా ఆడే ప్రతి టెస్ట్ మ్యాచ్కు పాయింట్లు కేటాయిస్తారు. గెలిచినా, టై అయినా, డ్రా అయినా పాయింట్లు ఇస్తారు. ఓడితే మాత్రం పాయింట్లు ఉండవు. కొత్త ఫార్మాట్ ప్రకారం చాంపియన్షిప్లో ఆడే ప్రతి జట్టు.. మిగతా ఎనిమిదిలోని ఏవేని ఆరు జట్లతో హోమ్ (3), ఆవే (3) పద్ధతిలో ఆరు సిరీస్లు ఆడాలి. ప్రతి సిరీస్లో రెండు నుంచి ఐదు మ్యాచ్ల వరకు ఉండొచ్చు.
అన్ని జట్ల సిరీస్ల్లో ఒకేలా మ్యాచ్లు ఉండాల్సిన అవసరం లేదు. కానీ సిరీస్ల సంఖ్య మాత్రం ఆరుకు మించకూడదు, తగ్గకూడదు. ప్రతి జట్టు.. ఒక్కో సిరీస్ నుంచి గరిష్టంగా 120 పాయింట్లు సాధించొచ్చు. మొత్తం పాయింట్లను మ్యాచ్ల సంఖ్యతో బై చేస్తారు. అలా వచ్చిన పాయింట్లతో లీగ్ స్టేజ్లో టాప్–2లో నిలిచిన రెండు టీమ్లు జూన్ 2021లో లార్డ్స్లో జరిగే ఫైనల్లో తలపడతాయి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ డ్రా లేదా టై అయితే.. లీగ్లో టాప్లో నిలిచిన టీమ్ను విజేతగా ప్రకటిస్తారు. యాషెస్ మాదిరిగా కొన్ని జట్లు సుదీర్ఘంగా సిరీస్లు ఆడటం వల్ల ఇతర జట్లకు ఇబ్బంది కలగకుండా
ఎఫ్టీపీలో భాగంగా వేరే టీమ్తో టెస్ట్లు ఆడుకోవచ్చు. కానీ ఇవి చాంపియన్షిప్లోకి రావు. దాదాపు 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత ఈ వరల్డ్ చాంపియన్షిప్కు ఐసీసీ ఆమోదముద్ర వేసింది.