
సౌతాంప్టన్ : గతంతో పోల్చితే ఫీల్డింగ్ లో టీమిం డియా ఎంతో మెరుగైంది. ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ మార్గనిర్దేశంలో ఆటగాళ్లు చురుకైనా ఫీల్డర్లుగా మారారు. క్యాచ్ లు అందుకోవడంలో టీమ్ను పర్ ఫెక్ట్గా మార్చిన శ్రీధర్ ఇప్పుడు డైరెక్ట్ హిట్ లపై దృష్టి పెట్టాడు. గురువారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న క్రికెటర్లు.. శ్రీధర్ కనిపెట్టిన ‘రౌండ్ ద క్లాక్ ’ అనే కొత్త రకం డ్రిల్తో నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోని వికెట్లను నేరుగా కొట్టడంపై ముమ్మరంగా కసరత్తులు చేశారు.
ఇందులో ప్రతీ ఆటగాడు ఆరు ఫీల్డింగ్ స్థానాల నుంచి బంతిని వికెట్ల మీదకు త్రో చేశారు. ప్రతీ ఒక్కరూ 20 సార్లు స్టంప్స్ను షూట్ చేసే దాకా ప్రాక్టీస్ చేశారు. ఒక్క ఆటగాడు తప్ప మిగిలిన జట్టంతా ఈ టాస్క్ను పూర్తి చేసిందని శ్రీధర్ చెప్పారు.సాంకేతిక సిబ్బంది ఫీల్డింగ్ విషయంలో ప్లేయర్లకు సూచనలు చేశారు.
బౌలర్ కోహ్లీ ..
వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాట్స్మన్ కోహ్లీపై ఈసారి వరల్డ్ కప్ లో భారీ అంచనాలున్నాయి. ఎన్ని సెంచరీలు చేస్తాడు. ఎన్ని రికార్డులు తిరగరాస్తాడనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ అందరిని ఆశ్యర్యపరిచాడు. నెట్స్లో విరాట్ ఆఫ్ కట్టర్లు వేస్తోన్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో ఉంచింది. దానిని చూసిన అభిమానులు టీమిండియాకు ఆరో బౌలర్ దొరికాడంటూ కామెంట్లు హోరెత్తించారు. ప్రాక్టీస్ లో కేదార్ కూడా పాల్గొన్నాడు.