వేళ్లు నరికి..గొంతు కొసి.. జగిత్యాలలో దారుణ హత్య

వేళ్లు నరికి..గొంతు కొసి.. జగిత్యాలలో దారుణ హత్య

రోజురోజుకు మనుషుల్లో మానవత్వం పోయి క్రూరత్వం పెరిగిపోతుంది. క్షణికావేశంలో ఇతరుల ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. డబ్బు కోసం, భూమి కోసం, కారణం ఏదైనా ఇతరుల నిండు ప్రాణాలు తీస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. బంధాలు, బాంధవ్యాలు మరిచి వివాదం మనసులో పెట్టుకొని హత్య చేస్తున్నారు. గత కొన్ని నెలలు ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వెలుగు చూశాయి.

జగిత్యాల జిల్లాలో ఘటన

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను గొంతు కోసి చంపాడు ఓ భర్త. ఈ ఘటన వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో జరిగింది. మార్చి 30వ తేదీ గురువారం తెల్లవారుజామున భార్యను(రాజేశ్వరి 35) భర్త బొల్లం జగదీశ్వర్ హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆవేశంలో భార్య రాజేశ్వరిని అర్ధరాత్రి ఇంటిలోనే కత్తిపీటతో చేతి వేలి కట్ చేసి, గొంతు కోసి అతి దారుణనికి ఒడిగట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడు జగదీశ్ పరారీలో ఉన్నాడు.  

ఏటూరునాగారంలో ఘటన

మరో చోట ఓ యువతి యువకుడిని హత్య చేసింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మూడో వార్డులో చోటుచేసుకుంది. జాడి సంగీత అనే యువతిని పెళ్లి చేసుకోమని అదే కాలనీకి చెందిన రామటెంకి శ్రీనివాస్(25) అనే యువకుడు వేధిస్తున్నాడని బుధవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో శ్రీనివాస్ ను  కత్తితో పొడిచి హత్య చేసింది సంగీత. వెంటనే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. కొద్దిరోజులుగా శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకోమని వేదిస్తున్నాడని.. వేదింపుతు భరించలేక అతడిని ఆవేశంలో హత్య చేశానని నిందితురాలు సంగీత పోలీసులకు వెల్లడించింది.