ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రాప్ లోన్స్ టార్గెట్ రూ.11వేల కోట్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రాప్ లోన్స్ టార్గెట్ రూ.11వేల కోట్లు
  • ఉమ్మడి జిల్లా రుణ ప్రణాళికలు ఖరారు
  • గతేడాది రుణ టార్గెట్‌‌‌‌‌‌‌‌ 90శాతం పూర్తి
  • ఈసారి 100 శాతం ఇచ్చేందుకు ప్రణాళికలు 
  • ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 12,77,508 ఎకరాల్లో సాగు అంచనా 

జగిత్యాల, వెలుగు: 2025–26 పంట కాలానికి ఆఫీసర్లు పంట రుణ ప్రణాళికను ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో 12,77,508 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారుల అంచనా. వీటి కోసం రూ.11,076 కోట్లు క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చేందుకు బ్యాంకర్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నారు. గతేడాది దాదాపు 90 శాతం క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ పూర్తికాగా, ఈ ఏడాది 100 శాతం లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

12,77,508 లక్షల ఎకరాల్లో సాగు అంచనా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 12,77,508 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 4,14, 419 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో అత్యధికంగా 3,10,642 ఎకరాల్లో వరి, మామిడి 38వేల ఎకరాలు , మొక్కజొన్న 32వేల ఎకరాలు, పత్తి 18వేలు ఎకరాలు, పసుపు 8,500 ఎకరాల్లో, ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ 3వేల ఎకరాలు, కంది 1,500 ఎకరాలు, మిగతా సోయాబిన్‌‌‌‌‌‌‌‌, మిర్చి, చెరుకు, ఇతర పండ్ల తోటలు సాగుచేయనున్నారు. 
    
కరీంనగర్ జిల్లాలో 3,43,240 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తుండగా ఇందులో ఎక్కువ మొత్తంలో వరి 2.76 ఎకరాల్లో సాగుచేయనున్నారు. వీటితోపాటు 48 వేల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న,  కంది, వేరుశనగ, మిర్చి, పసుపు, ఇతర పండ్లు, కూరగాయలు సాగవుతాయని అంచనా. 
    
రాజన్నసిరిసిల్ల జిల్లా లో 2,43,773 ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందులో 1,84,860 ఎకరాల్లో వరి, 49,760 ఎకరాల్లో పత్తి, 1,600 ఎకరాల్లో మొక్కజొన్న, 1,400 ఎకరాల్లో జొన్నలు, 1,234 ఎకరాల్లో పప్పుదినుసులు, 6,304 ఎకరాల్లో వివిధ పంట సాగు అంచనాలు ఉన్నాయి. 
    
పెద్దపల్లి జిల్లాలో 2,76,076 ఎకరాల్లో పంటలు సాగు అంచనాలున్నాయి. వరి 2,12,500 ఎకరాల్లో, 52వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. వీటితో పాటు ఎర్ర జొన్నలు, ఆవాలు, వేరు శనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు తదితర పంటలు సైతం తక్కువ విస్తీర్ణంలో సాగు కానున్నట్లు అంచనాలు ఉన్నాయి. 

రూ.11 వేల కోట్ల రుణాలు టార్గెట్

2025–26 పంటకాలానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.11,156 కోట్లు లోన్ ఇచ్చేందుకు బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతేడాది రూ.11,076 కోట్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకోగా 90శాతం వరకు మాత్రమే పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి 100శాతం టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి అందించనున్న మొత్తం లోన్లలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా రూ.5157.33కోట్లు రైతులకు రుణంగా ఇవ్వనున్నారు. 

జగిత్యాల జిల్లాలో 1,54,449 ఎకరాలకు  రూ.2,564 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.1519 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో రూ. 1916 కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. పంటల సాగుకు అనుగుణంగా ముందస్తుగా పెట్టుబడులకు బ్యాంకు రుణాలు అందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.