శుభకార్యానికి వెళ్తూ నదిలో గల్లంతైన అక్కా తమ్ముడు

 శుభకార్యానికి వెళ్తూ నదిలో గల్లంతైన అక్కా తమ్ముడు

కడప జిల్లా రాయచోటిలో వాగు దాటుతుండగా ప్రమాదం
కడప:
తండ్రితో కలసి శుభ కార్యానికి బయలుదేరిన అక్కా తమ్ముడు వాగు దాటుతూ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. కడప జిల్లా రాయచోటి వద్ద ఆదివారం జరిగిందీ ఘటన. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో  సంతోషంగా శుభ కార్యానికి బయలుదేరిన  ఇద్దరు పిల్లలు నదిలో గల్లంతై కన్నుమూసిన ఘటన విషాదం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. 
రాయచోటి నియోజకవర్గం, చాకిబండి కు చెందిన అమీర్ బాష కు ఇద్దరు పిల్లలు. అక్క షాజియా (16), తమ్ముడు జాసీర్ (11). వీరు తండ్రి అమీర్ బాషతో కలసి శుభ కార్యానికి బయలుదేరారు. వండాడి (చెరువు)  వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మాండవ్య నదిలో అక్క షాజియా (16) , తమ్ముడు జాసీర్ (11) ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వాండాది వద్ద  వాగు దాటుతుండగా వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలు ఒకే రోజు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.