కాశ్మీర్ లోయలో పనిచేస్తున్న ఓ సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు అక్షరాల రూ. 1.5 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. బుద్గాం జిల్లాలోని చారారే-షరీఫ్లో సీఆర్పిఎఫ్ కు చెందిన బెటాలియన్ క్యాంపు ఉంటుంది. వారి నెలవారీ కరెంట్ బిల్లును పవర్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్(పిడిడి) చెల్లిస్తుంది. ఈ క్యాంపుకు కరెంట్ బిల్లు ప్రతినెలా రూ. 1500 వరకు వస్తుంది. అయితే గత జూలై నెల బిల్లు మాత్రం రూ. 1,51,59,897 (కోటి యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు) వచ్చింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లు రావడంతో కాశ్మీర్ లోయలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్) గందరగోళానికి గురైంది. ఈ నెలవారీ బిల్లును జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలోని విద్యుత్ అభివృద్ధి శాఖ (పీడీడీ) పంపించింది. ఈ బిల్లును 181 బెటాలియన్, సిఆర్పీఎఫ్ పేరు మీద పంపించింది.
ఈ విషయంపై సీఆర్పీఎఫ్కు చెందిన ఎడిజి జుల్ఫికర్ హసన్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు విషయంలో అధికారుల లోపం ఉన్నట్లు అనిపిస్తుంది. పీడీడీ విభాగాన్ని వివరణ కోసం సంప్రదించడానికి ప్రయత్నించాం. కానీ, వారాంతం కావడంతో ఆఫీసులన్నీ మూసివేయబడి ఉన్నాయి’ అని ఆయన తెలిపారు.
ఈ బిల్లులో బెటాలియన్ 50 కిలోవాట్లు మాత్రమే వాడిందని.. దానికి బిల్లు రూ. 1500 చెల్లించాలని బిల్లులో ఒక దగ్గర ఉంది. కానీ, టోటల్ బిల్లు దగ్గరికి వచ్చేసరికి మాత్రం రూ. కోటి యాభై లక్షలు పైగా ఉంది. ఆగస్టు 10న వచ్చిన ఈ బిల్లును.. ఆగస్టు 27లోగా చెల్లించాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఆలోగా ఈ సమస్యను పరిష్కరించాలని సీఆర్పిఎఫ్ పీడీడీ విభాగాన్ని పేర్కొంది.
For More News..