హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐపీఎస్, రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ టెన్నిస్ కోర్టులో మరోసారి మెరిశారు. అర్బన్ రైస్ కప్ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ 55 ప్లస్ సింగిల్స్లో టైటిల్ నెగ్గారు.
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హోటా) ఆధ్వర్యంలో ఎఫ్ఎన్సీసీ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో ఆనంద్ 6–-2, 6–-3 స్కోరుతో గోవాకు చెందిన నీలకంఠ్ దామ్రేపై వరుస సెట్లలో విజయం సాధించారు. దాదాపు 4 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆనంద్ ఓ టెన్నిస్ టోర్నమెంట్ను గెలుచుకోవడం విశేషం. హోటా ప్రెసిడెంట్ నంద్యాల నర్సింహా రెడ్డి తదితరులు ఆనంద్కు ట్రోఫీ అందజేశారు.
