బిజినెస్ డెస్క్, వెలుగు: ‘డియర్ కస్టమర్ మీకు కరెంట్ సప్లయ్ ఈ రోజు రాత్రి 8.30 నుంచి ఆగిపోతుంది. ఎందుకంటే ముందు నెల కట్టాల్సిన ఎలక్ట్రిసిటీ బకాయిలు ఇంకా అప్డేట్ కాలేదు. వెంటనే మా ఏజెంట్ నెంబర్ 82404xxxxx కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్యూ’ అంటూ మీకెప్పుడైన మెసేజ్ వస్తే జాగ్రత్తగా ఉండండి.
ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి, సప్లయర్ల నుంచి మెసేజ్ పంపినట్టు కొంత మందిని మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఇటువంటి ఫ్రాడ్ మెసేజ్లకు రెస్పాండ్ అయితే మరొక నెంబర్కు కాల్ చేయమని తొందర పెడుతున్నారు. ఆ నెంబర్కు గాని కాల్ చేస్తే మీ అకౌంట్లోని డబ్బులన్నీ మాయం చేస్తారు. కొత్తగా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదంటూ కొత్త స్కామ్కు తెర తీశారు సైబర్ మోసగాళ్లు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్లును ఆన్లైన్లో కట్టే వాళ్లను వీరు టార్గెట్ చేస్తున్నారు.
ఇలా చేస్తారు..
ఇటువంటి స్కామ్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. చాలా మంది బాధితులు సోషల్ మీడియాలో తమ స్టోరీని పంచుకుంటున్నారు. దిగంబర్ కరేకర్ తన రిలెటివ్స్ ఇటువంటి మోసానికి ఎలా గురయ్యారో ట్విటర్లో వివరించారు. ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకరు ఈ స్కామ్కు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు అతని నుంచి రూ. 25,000 కాజేశారు.
బిల్లులు చెల్లించకపోవడం వలన ఈరోజు రాత్రి నుంచి కరెంట్ సప్లయ్ ఆగిపోతుందని ఆయన కూతురికి మెసేజ్ వచ్చింది. దీంతో మెసేజ్లో ఇచ్చిన నెంబర్కు ఆమె కాల్ చేశారు. తర్వాత ఆమె ఆ కాల్ను తన తండ్రికి ఫార్వార్డ్ చేశారు. ఆ నెంబర్కు కాల్ చేయగానే ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడానికి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు. టెస్టింగ్ కోసం రూ.5 పేమెంట్ చేయాలన్నారు.
చేశాక ఆయన అకౌంట్లో రూ.25,000 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి’ అని ఆయన వివరించారు. సైబర్ పోలీస్ సర్వీస్లు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయా? అని ముంబై పోలీస్ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
ఇది ఫ్రాడ్ గురూ!
మోసగాళ్ల ఉచ్చులో కస్టమర్లు చిక్కుకుపోకుండా చూసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి మోసాలపై ప్రజల్లో అవగాహన కలిపిస్తోంది. రాంగ్ నెంబర్లను అర్థం చేసుకొని వారి మెసేజ్లకు, కాల్స్కు రెస్పాండ్ కావొద్దని, వారికి కాల్ బ్యాక్ చేయొద్దని సలహాయిస్తోంది.
మోసగాళ్ల మెసేజ్లకు రెస్పాండ్ అయితే వారి మీ పర్సనల్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ను దొంగిలిస్తారని వివరించింది. జాగ్రత్తగా ఉండాలని, ఎస్బీఐతో సేఫ్గా ఉండాలని ట్విటర్లో పోస్ట్ చేసింది. రాంగ్ నెంబర్లను గుర్తించేందుకు కొన్ని సూచనలు చేసింది.
1 మెసేజ్ పర్సనల్ నెంబర్ నుంచి వచ్చిందా లేదా ఆఫీస్ నెంబర్ నుంచి వచ్చిందా? అనేది చెక్ చేసుకోవాలని ఎస్బీఐ పేర్కొంది. సాధారణంగా ఎలక్ట్రిసిటీ బోర్డు లేదా సప్లయర్లు అఫీషియల్ నెంబర్ ద్వారానే మెసేజ్ పంపుతారు.
2 ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏదైనా మెసేజ్ లేదా వ్యక్తి (ర్యాండమ్ నెంబర్ను నుంచి వచ్చే) తొందర పెడితే, రెస్పాండ్ అయ్యే ముందు కొంత సేపు ఆలోచించండి. మోసగాళ్లు మిమ్మల్లి తొందర పెట్టి భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తారు. మీరు ఆలోచించుకోవడానికి టైమ్ లేకుండా చేస్తారు.
3 మోసగాళ్లు పంపే మెసేజ్లలో అక్షర దోషాలు, గ్రామర్ తప్పులు ఎక్కువగా ఉంటాయి. మీకు వచ్చిన మెసేజ్ను జాగ్రత్తగా చదివితే వీటిని గుర్తించొచ్చు. కస్టమర్లు తమకు వచ్చిన మెసేజ్ను ఎవరు పంపారో ముందు చెక్ చేసుకోవాలని ఎస్బీఐ పేర్కొంది. ఆ తర్వాతనే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇంకా ఒక నెల ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్ను మిస్ అయితే ఎలక్ట్రిసిటీ బోర్డును లేదా సప్లయర్ను ముందుగా సంప్రదించాలని సలహాయిచ్చింది. ముందు నెలల్లో కట్టిన బిల్లుల్లో ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది.
టెక్స్ట్ మెసేజ్ స్కామ్లు లేదా స్మిషింగ్ బాగా పాపులర్ అయిన ఆన్లైన్ ఫ్రాడ్ ట్రిక్. మోసగాళ్లు వ్యక్తుల పర్సనల్ ఇన్ఫర్మేషన్ను, డబ్బులను దొంగిలిస్తారు. కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ కూడా ఈమధ్య మోసగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. ర్యాండమ్ నెంబర్ నుంచి వచ్చే ఎటువంటి మెసేజ్కి అయినా రెస్పాండ్ అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి రెస్పాండ్ అవ్వండి.