
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కిందటి ఆర్థిక సంవత్సరంలో బంపర్ లాభాలు చూశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) కలిసి 2023–24 లో ఏకంగా రూ.81 వేల నికర లాభాన్ని సాధించాయి. ఈ మూడు కంపెనీలు కూడా 2023–24 లో తమ అత్యధిక నికర లాభాన్ని ప్రకటించాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఐఓసీకి రూ.39,618.84 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.8,241.82 కోట్లతో పోలిస్తే ఇది సుమారు ఐదు రెట్లు ఎక్కువ.
బీపీసీఎల్ నికర లాభం 2022–23 లో రూ.1,870.10 కోట్లు ఉంటే 2023–24 లో రూ.26,673.50 కోట్లకు పెరిగింది. హెచ్పీసీఎల్కు 2022–23 లో రూ.8,974.03 కోట్ల నష్టం వస్తే, కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.14,693.83 కోట్ల లాభం సాధించింది. 2022–23 లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు భారీగా తగ్గాయి. గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు పెరిగినా, ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ కంపెనీలకు సపోర్ట్ చేసేందుకు 2023–24 బడ్జెట్లో రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
తర్వాత ఈ సపోర్ట్ను రూ.15 వేల కోట్లకు తగ్గించారు. రైట్స్ ఇష్యూ ద్వారా ఈ సపోర్ట్ అందించాల్సి ఉండగా, ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. దేశంలో 90 శాతం ఆయిల్ రిటైల్ మార్కెట్ను కంట్రోల్ చేస్తున్న ఈ మూడు కంపెనీలు గత రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు వీటి ప్రాఫిట్స్ పడిపోతున్నాయి. ముడిసరుకుల ధరలు తగ్గినప్పుడు వీటి లాభాలు పెరుగుతున్నాయి.
2022 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్కు రూ.21,201.18 కోట్ల నష్టం వచ్చింది. తర్వాత గ్లోబల్గా ఆయిల్ ధరలు తగ్గడం, ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడి ఇవ్వడంతో ఈ కంపెనీలు లాభాల్లోకి వచ్చాయి.