![చైనా దిగుమతులే దిక్కు..2023-24 లో 101.7 బిలియన్ డాలర్లకు ఇంపోర్ట్స్](https://static.v6velugu.com/uploads/2024/05/china-continues-to-be-indias-largest-trading-partner_xuLs1TCMK9.jpg)
- గత ఐదేళ్లలో 44.7 శాతం పెరుగుదల
- ఎగుమతుల్లో లేని గ్రోత్
- అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా కొనసాగుతున్న చైనా
న్యూఢిల్లీ : ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా కొనసాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశంతో 118.4 బిలియన్ డాలర్ల (రూ.9.82 లక్షల కోట్ల) విలువైన వ్యాపారం జరిగింది. యూఎస్తో కంటే కొద్దిగా ఎక్కువగా ఇది ఉంది. ఇండియా, యూఎస్ల మధ్య కిందటి ఆర్థిక సంవత్సరంలో 118.3 బిలియన్ డాలర్ల (రూ.9.81 లక్షల కోట్ల) విలువైన వ్యాపారం జరిగింది. 2022–23, 2021–22 లో ఇండియాకు యూఎస్ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా నిలిచింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నా, ఈ దేశంతో జరుగుతున్న వ్యాపారం పెరుగుతూనే ఉండడాన్ని గమనించాలి.
చైనా నుంచి దిగుమతులు 2023–24 లో 3.24 శాతం పెరిగి (ఇయర్ ఆన్ ఇయర్) 101.7 బిలియన్ డాలర్ల (రూ.8.44 లక్షల కోట్ల) కు చేరుకున్నాయి. ఈ దేశానికి ఇండియా నుంచి జరిగిన ఎగుమతులు 16.67 బిలియన్ డాలర్ల (రూ.1.38 లక్షల కోట్ల) దగ్గర ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 8.7 శాతం పెరిగాయి. చైనాకు ఇండియా నుంచి ఐరన్ ఓర్, కాటన్ యార్న్, ఫ్యాబ్రిక్స్, హ్యాండ్లూమ్, మసాలాలు, పండ్లు, కూరగాయలు, ప్లాస్టిక్ వంటి ప్రొడక్ట్ల ఎగుమతులు పెరిగాయి.
మరోవైపు యూఎస్కు ఇండియా నుంచి జరిగిన ఎగుమతులు 2023–24 లో 1.32 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గి 77.5 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 78.54 బిలియన్ డాలర్లుగా ఉంది. యూఎస్ నుంచి దిగుమతులు 20 శాతం తగ్గి 40.8 బిలియన్ డాలర్లకు పడ్డాయి.
చైనాతో పెరుగుతున్న ట్రేడ్ డెఫిసిట్
టాప్ 15 ట్రేడింగ్ పార్టనర్లతో ఇండియా వ్యాపార సంబంధాల్లో చాలా మార్పొచ్చిందని, 2019–20 నుంచి 2023– 2024 మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో మార్పొచ్చిందని, అలానే ట్రేడ్ డెఫిసిట్ (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా), మిగులులో కూడా తేడా కనిపిస్తోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) పేర్కొంది. చైనాకు ఇండియా నుంచి జరిగే ఎగుమతులు గత ఐదేళ్లలో 0.6 శాతం తగ్గి 16.75 బిలియన్ డాలర్ల నుంచి 16.67 బిలియన్ డాలర్లకు పడ్డాయని వెల్లడించింది.
మరోవైపు ఈ డ్రాగన్ కంట్రీ నుంచి చేసుకుంటున్న దిగుమతులు 44.7 శాతం పెరిగి 70.32 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పెరిగాయని పేర్కొంది. ‘దిగుమతులు భారీగా పెరగడంతో చైనాతో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువవుతోంది. 2019–20 లో 53.57 బిలియన్ డాలర్లు ఉంటే, 2023–24 లో 85.09 బిలియన్ డాలర్ల (రూ.7.06 లక్షల కోట్ల) కు పెరిగింది. దిగుమతులు పెరుగుతున్నా, ఎగుమతుల్లో గ్రోత్ లేకపోవడం ఆందోళనకరం’ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాత్సవ అన్నారు.
యూఎస్కు చేస్తున్న ఎగుమతులు గత ఐదేళ్లలో 47.9 శాతం పెరిగి 52.41 బిలియన్ డాలర్ల నుంచి 77.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఇదే టైమ్లో యూఎస్ నుంచి దిగుమతులు 14.7 శాతం పెరిగి 35.55 బిలియన్ డాలర్ల నుంచి 40.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో యూఎస్తో జరుపుతున్న ట్రేడ్లో ఇండియా మిగులు సాధించింది. ఈ మిగులు గత ఐదేళ్లలో 16.88 బిలియన్ డాలర్ల నుంచి 36.74 బిలియన్ డాలర్ల (రూ.3.05 లక్షల కోట్ల) కు పెరిగింది.
కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం, ఇండియాకు చైనా 2013 నుంచి 2018 వరకు, మళ్లీ 2020–21 లో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్గా నిలిచింది. 2023–24 లో 83.6 బిలియన్ డాలర్ల వ్యాపారంతో యూఏఈ మూడో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రష్యా, సౌది, సింగపూర్ దేశాలు ఉన్నాయి.