
ఖమ్మం, వెలుగు: ఆన్ లైన్లో ట్రేడింగ్ పేరుతో నమ్మించి రూ.1.62 కోట్లు కాజేసిన కేసులో నిందితుడిని నాగర్ కర్నూల్ లో ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బోనకల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కొందరు ఫోన్ చేసి, ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశ చూపించారు. వాట్సప్, ట్రేడింగ్ లింకులు పంపించి రూ.1.62 కోట్లు కాజేశారు.
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితుడైన నేనావత్ అఖిల్(23)ను నాగర్ కర్నూల్ లో అరెస్ట్ చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.