న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న ఓ సైబర్ ముఠా నిందితుడు తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పై నుంచి పడి గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఉన్న ఓ సైబర్ ముఠా తెలంగాణలోని పలువురిని ట్రాప్చేసి దాదాపు రూ.30 లక్షలకు పైగా కొట్టేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు.. ముఠాలోని ఓ సభ్యుడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం హైదరాబాద్కు తరలించే క్రమంలో నిందితుడిని ఢిల్లీలోని తెలంగాణ భవన్ 4వ అంతస్తులో ఉంచారు. ఆ బ్లాక్కు ఆనుకొని మరో బిల్డింగ్ ఉంది. పైపుల సాయంతో అందులోకి వెళ్లేందుకు ట్రై చేస్తూ.. మధ్యలో పట్టుతప్పడంతో నిందితుడు జారి కిందపడ్డాడు. గాయపడిన అతనికి ట్రీట్మెంట్ అందించించిన పోలీసులు తర్వాత విమానంలో హైదరాబాద్కు తరలించారు.