గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ షీ టీంకు మే నెలలో వేధింపులు, బ్లాక్మెయిలింగ్కు సంబంధించిన ఫిర్యాదులు పెరిగాయి. వాట్సాప్, ఈ–మెయిల్, హ్యాక్వే, నేరుగా 166 ఫిర్యాదులు రాగా వీటిలో వాట్సాప్ ద్వారానే 128 వచ్చాయి. ఇందులో ఫోన్ వేధింపులు 50, బ్లాక్ మెయిలింగ్ 25, సోషల్ మీడియా వేధింపులు13 ఉన్నాయి. వీటిల్లో పోలీసులు 7 క్రిమినల్, 27 పిట్టీ కేసులు నమోదు చేశారు. మహిళలు, యువతులను వేధిస్తున్న వారిలో మైనర్లే ఎక్కువగా ఉన్నారు. మే నెలలో మొత్తం 210 మంది వేధింపులకు పాల్పడగా వీరిలో మైనర్లు 38 మంది ఉన్నారు.
ఫోన్ రిపేరుకు ఇస్తే బ్లాక్ మెయిల్
జగద్గిరిగుట్టకు చెందిన ఓ మహిళ తన ఫోన్ ను పక్కనే ఉన్న మొబైల్ షాప్లో రిపేరుకు ఇచ్చింది. అనంతరం తిరిగి తీసుకుంది. తర్వాతి రోజు నుంచి ఆమెకు డైలీ గుర్తు తెలియని నంబర్ల నుంచి ఓ వ్యక్తి ఫోన్చేస్తున్నాడు. తన వద్ద మహిళ ఫేస్తో మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని, తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు షీ టీంకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో వేధిస్తున్నది మొబైల్ షాప్ నిర్వాహకుడు శ్రీకాంత్అని తేలింది. రిపేర్ టైంలో మహిళ ఫోన్ నుంచి ఫొటోలు, పర్సనల్వివరాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రేమ పేరుతో ట్రాప్
రాజేంద్రనగర్లో ఓ జ్యువెల్లరీ షాప్లో బి.సాగర్ అనే వ్యక్తి అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక కుటుంబం రెగ్యులర్గా ఆ షాప్కు వస్తుంటుంది. దీంతో సాగర్బాలికను ట్రాప్చేశాడు. ఆమె పర్సనల్ఫొటోలు తీసుకొన్నాడు. అనంతరం తరచూ వీడియో కాల్స్ మాట్లాడేవాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి సాగర్ను హెచ్చరించాడు. దీంతో అతడు బ్లాక్మెయిల్చేయడం స్టార్ట్ చేశాడు. తనకు బాలికను ఇచ్చి పెండ్లి చేయాలని లేకుంటే, ఆమె క్యారెక్టర్ను బ్లేమ్చేస్తానని సాగర్బెదిరించాడు. ఆందోళన చెందిన బాలిక తండ్రి షీ టీంను సంప్రదించాడు.