రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో కల్తీ ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు. అనుమతి లేకుండా కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 500 కేజీల నకీల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టన్ను వెల్లుల్లితో పాటు లిటిల్ చాప్స్ పేరుతో అమ్మే మ్యాంగో డ్రింక్ ను సీజ్ చేశారు.
కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఎలాంటి అనుమతుల్లేకుండానే గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ వ్యాపారం జరుగుతోంది. కుల్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టు తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. ఘాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్టులో అసిటిక్ యాసిడ్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. మెషినరీలో కుల్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పాయల పొట్టును సైతం కలుపుతూ పేస్ట్ తయారీ చేస్తున్నారు.
పక్కా సమాచారంతో దాడి చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పరిశ్రమపై దాడి చేసి అపరిశుభ్రత, మురుగు నీరు, ప్రమాదకరమైన రసాయనిక పదార్దాలను గుర్తించారు. 500 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్టు, భారీగా మ్యాంగో కూల్ డ్రింగ్, ప్రమాదకరమైన రసాయనాలు, మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్, టన్ వెల్లుల్లిని సీజ్ చేసిన అధికారులు ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు.