ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు

బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది ఇవాళ వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీనికి వాతావరణ శాఖ ‘యాంపిన్’ అని పేరు పెట్టారు. యాంపిన్ రేపు(శనివారం) సాయంత్రం లేదంటే ఎల్లుండి ఉదయానికి తుపాన్ గా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  ఆ తర్వాత మొదట వాయవ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుపాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, దీనికి యాంపిన్ తోడు కానుందని…. 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. ఇవాళ రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తంగా తుపాను కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.