Dasara special 2025 : శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి.. అమ్మవారి ఏ భాగం ఏ క్షేత్రంలో ఉంది..

Dasara special 2025 : శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి.. అమ్మవారి ఏ భాగం ఏ క్షేత్రంలో ఉంది..

దసరా నవరాత్రిళ్లు కొనసాగుతున్నాయి.  అమ్మవారి శక్తి పీఠాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పురాణాలప్రకారం శక్తి పీఠాలు అంటే ఏమిటి..  అవి ఎలా ఏర్పడ్డాయి..ఎక్కడెక్కడ ఉన్నాయి.. దసరా పండుగ సందర్భంగా ఏ శక్తి పీఠంలో ఎలాంటి ప్రత్యేకత... వాటి విశిష్టత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ..

దక్షయఙ్ఞం సమయంలో పుట్టింట్లో  అవమానాలకు గురైన పార్వతిదేవి యోగాగ్నిలో భస్మమైన తరువాత ..  సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు.. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.

 సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు .. శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని పండితులు చెబుతున్నారు.  భక్తులకు...  తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.... ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది....సతీదేవి  శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకున్నారు. అమ్మవారిని ఆరాధించే దేవాలయాల్లో  పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రదేశాలను శక్తి పీఠాలు అంటారు.....పురాణాల  ఆధారముగా ఈ శక్తిపీఠాలను  మనులు.. మహర్షులు గుర్తించారు.   మనదేశం లోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి .....శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి.... 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి..... పండితులు తెలిపిన వివరాల ప్రకారం  ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. ....వాటిలో  18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. 

1.శాంకరీదేవి ( శ్రీలంక) :  దేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు..... ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు... ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు... 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది..... ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2.  కామాక్షి అమ్మవారు ( తమిళనాడు ..కంచి): సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం.... ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది... పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల పాపాలు తొలగి  సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి...

3. శృంఖలాదేవి ( గుజరాత్... ప్రద్యుమ్నం ​) : అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం.... ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు..... 

4.  చాముండి దేవి ( కర్నాటక..  మైసూరు) : పరమేశ్వరుడు రుద్ర తాండవం చేసే సమయంలో అమ్మవారి తొడ  వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం...... ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది...... ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజ లందుకుంటోంది. ఇక్కడ దసరా ఉత్సవాలు  ఘనంగా జరుగుతాయి. 

5. జోగులాంబ ( తెలంగాణ...  అలంపూర్​): అమ్మవారి  నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం..... సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు... దవడ భాగం పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. .... ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు.... అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట.... 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు.... ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. 

6.భ్రమరాంబిక ( ఆంధ్రప్రదేశ్​.. శ్రీశైలం) :  సతీ దేవి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం... ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి..... ఇక్కడ కొలువైన సతీ దేవి శక్తి  భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట.... అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు.

7.మహాలక్ష్మి (మహారాష్ట్ర.. కొల్హాపూర్​):    కొల్హాపూర్‌ క్షేత్రంలో  సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు..... కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు..... కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల.... అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు...... నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు..... మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి.... అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

8.ఏకవీరాదేవి (మహారాష్ట్ర... మహూర్ పర్వతం మీద ):  దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు... నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి.... దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్ముతుంటారు. .. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి.... అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు.... మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది.... మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది..... అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పూజలు అందుకుంటారు. పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది.... ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు.

9.మహాకాళి అమ్మవారు ( మధ్యప్రదేశ్​..ఉజ్జయిని) :  సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది...  ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది.... ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం..... స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం...

10.పురుహూతిక అమ్మవారు ( ఆంధ్రప్రదేశ్​, పిఠాపురం) :  పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొన్నారు.... ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది.... ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి.... ఇది గయాక్షేత్రం కూడా.... గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు....

11.గిరిజాదేవి (ఒరిస్సా) :ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి.... గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు.

12.మాణిక్యాంబాదేవి ( ఆంధ్రప్రదేశ్​, ద్రాక్షారామం) : సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం.  ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట.... అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13.కామాఖ్యాదేవి ( అసోం):  గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం..... అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు..... గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. ఎప్పుడూ  ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది..... ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది.ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు.

14.మాధవేశ్వరీదేవి(అలహాబాద్​) :  అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ  ప్రాంతంలో పడినట్టు చెబుతారు..... సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు..... నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది.... దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు.... భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు..... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ కూడా అంటారు. 

15.సరస్వతి  అమ్మవారు(కాశ్మీర్​):  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు (ముజఫరాబాద్‌) కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు.... ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు..... ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు.... ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16.వైష్ణవీదేవి ( హిమాచల్​ ప్రదేశ్​):  అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు..... ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు

17.మంగళగౌరీదేవి (గయ):  సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ..... అమ్మవారు మంగళగౌరీదేవి..... స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.  ఇక్కడి తీర్థం ఫల్గుణీనది.... ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం....  మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18.విశాలాక్షి అమ్మవారు ( కాశీ) :  సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది..... వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది..... ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు..... శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.
 
ఇవి ప్రధానమైన 18 శక్తిపీఠాలు.... ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు..... ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.