
హైదరాబాద్, వెలుగు : రోజురోజుకి డేటా చోరి నేరాలు పెరుగుతున్నాయని, డేటా చోరీలపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సైబర్ సెక్యురిటీ క్లస్టర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. వెరిజాన్ 2019 డేటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును(డీబీఐఆర్) అంజనీ కుమార్ విడుదల చేశారు. ఏ సిస్టమ్ కూడా 100 శాతం పర్ఫెక్ట్ కాదని, వీటిపై మనకు అవగాహన ఉండాలన్నారు. ఐటీ కంపెనీలు, బ్యాంక్లు, ఆన్లైన్లో వ్యాపారాలు చేసే వారందరూ సైబర్ అటాక్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు 73 గ్లోబల్ కంట్రిబ్యూటర్లతో కలిసి వెరిజాన్ ఈ రిపోర్టును రూపొందించింది. మొత్తంగా 86 దేశాల్లో 41,686 సెక్యురిటీ ఘటనలు తలెత్తగా.. వాటిలో 2,013 డేటా బ్రీచ్లు జరిగినట్టు నిర్ధారణైనట్టు ఈ రిపోర్టులో వెరిజాన్ వెల్లడించింది.
2020 నాటికి 75 శాతం ప్రజలు క్లౌడ్ ఆధారిత సేవలే పొందుతారని, ఇటీవల కాలంలో క్లౌడ్ కు సంబంధించి డేటా బ్రీచ్లు ఎక్కువగా జరుగుతున్నాయని తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ ముస్తాఫ షేక్ తెలిపారు. డేటా సెక్యురిటీ విషయంలో అన్ని ప్రభుత్వాల కంటే మన ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తోందని, గతేడాది లాంచ్ చేసిన హైదరాబాద్ సైబర్ క్లస్టర్ కూడా మెరుగైన సేవలందిస్తోందన్నారు. ఈ క్లస్టర్లో 45కు పైగా ఆర్గనైజేషన్లు సభ్యులుగా ఉన్నాయన్నారు. సైబర్ సెక్యురిటీ కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. వెరిజాన్ రిపోర్ట్లో తాము భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని అన్నారు. ఇంటర్ ఫలితాల విడుదలలో ఎలాంటి సైబర్ సెక్యురిటీ లోపం లేదని చెప్పారు.
2020 నాటికి నగరంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను హైటెక్ సిటీలో ఏర్పాటు చేస్తున్నట్టు, దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు హైదరాబాద్ సైబర్ క్లస్టర్ సీఈవో జాకీ ఖురేషి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న రెండో అతిపెద్ద కార్యక్రమం ఇదేనన్నారు. ఈ సెంటర్ను 2020 రెండో క్వార్టర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దీంతో డేటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్లకు హైదరాబాద్ను హబ్గా మారుస్తామన్నారు. ఈ సైబర్సెక్యురిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో డేటా బ్రీచ్పై ఇన్వెస్టిగేషన్స్ చేపట్టడమే కాకుండా… ఇన్నోవేషన్స్, ఎంటర్ప్రిన్యూర్షిప్, కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేపట్టనున్నట్టు జాకీ ఖురేషి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాదే దేశంలోనే తొలి సైబర్ క్లస్టర్ను హైదరాబాద్లో లాంచ్ చేసింది.
ఆర్థిక వ్యవహారాలే లక్ష్యంగా దాడులు…
69 శాతం డేటా బ్రీచ్లు బయట వారే చేపడుతున్నారని, 34 శాతం మాత్రమే ఇంటర్నల్గా జరుగుతున్నట్టు వెరిజాన్ సౌత్ ఈస్ట్ ఆసియా అండ్ ఇండియా సొల్యుషన్స్ హెడ్ ప్రశాంత్ గుప్తా చెప్పారు. ఆర్థిక పరమైన వ్యవహారాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్టు వెల్లడించారు. చాలా వెబ్ అప్లికేషన్లు కూడా దాడులకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. రాన్సమ్ వేర్ దాడులు మరింత బలపడుతున్నాయని, వెరిజాన్ విశ్లేషించిన డేటాలో 24 శాతం వాటివేనని తెలిపారు. అయితే క్రిప్టో మైనింగ్ దాడులు స్వల్పంగానే ఉన్నాయని, ఇవి కేవలం 2 శాతం వరకు ఉన్నాయని చెప్పారు. 2014 నుంచి వెరిజాన్ ఈ రిపోర్ట్ను విడుదల చేస్తోంది. ప్రారంభించినప్పుడు కంటే ఈ సారి ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్న కంట్రిబ్యూటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.