
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎయిరిండియా సిబ్బందినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి యూట్యూబ్లో పెట్టిన కామెంట్ను వార్నర్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశాడు. ప్రమాదానికి గురైన ఫ్లైట్లో భద్రతా ప్రొటోకాల్ సరిగ్గా అమలు చేయలేదని సదరు వ్యక్తి తన కామెంట్లో పేర్కొన్నాడు.
ఏండ్ల తరబడి మెకానికల్ సమస్యలు ఉన్నాయని, సిబ్బంది, పైలట్లు, ఇంజినీర్లు ఈ విషయాన్ని లాగ్బుక్లో నమోదు చేసినప్పటికీ మేనేజ్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. దీనిపై వార్నర్ స్పందిస్తూ.. ‘‘ఇది నిజమే అయితే మాత్రం దారుణం.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటన తర్వాత ఎయిరిండియాలో ఇకపై ప్రయాణించవద్దని నిర్ణయించుకున్నా” అని వార్నర్ చెప్పారు.