కేసీఆర్​ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : కూచాడి శ్రీహరి రావు

కేసీఆర్​ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : కూచాడి శ్రీహరి రావు

నిర్మల్, వెలుగు: కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, తొమ్మిదేండ్ల కాలంలో ఎంతో మంది అమాయక యువకులు, నిరుద్యోగులు, మహిళలు, పేద ప్రజలను మోసం చేశారని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ఫైర్​అయ్యారు. మామడ మండలంలోని కమల్ కోట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు లంబాడి లాల్ సింగ్, గన్మెన నాగేశ్ బీఆర్ఎస్ కు, సారంగాపూర్ మండల ఉపాధ్యక్షుడు గుంటుక నవీన్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. కొత్త హామీలతో మోసం చేయడానికి వస్తున్న కేసీఆర్ ను ప్రజలు తరిమికొడతారని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని.. బీజీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలను ఇంటింటికి తీసుకెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లి విలాస్ రావు, ఒలత్రి రాజు, బొల్లోజి నర్సయ్య, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయం ప్రారంభం

మామడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శ్రీహరి రావు ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకుల మోసపూరితమైన మాటలను ప్రజలు నమ్మరని, ఈ సారి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు.