నాగర్కర్నూల్, వెలుగు: మేఘాకు రాష్ట్ర సర్కారు అండగా ఉందని, అందుకే ఎంతమంది చనిపోయినా పట్టించుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆరోపించారు. శనివారం రేగుమానుగడ్డ వద్ద పాలమూరు లిఫ్ట్ ఫస్ట్ ప్యాకేజీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకుముందు ఘటనా స్థలానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ మనోహర్తో మాట్లాడగా.. ఐదుగురిని అనుమతించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ ఐదుగురు కార్మికుల చావుకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, ఆయనను వెనకేసుకొస్తున్న ప్రభుత్వం తమ లాంటి వారిని అడ్డుకునేందుకు పోలీసులను వాడుకుంటుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ స్కాంలో భాగస్వామి అయిన మేఘా లాంటి సంస్థల దెబ్బకు తెలంగాణ సాగు నీటిరంగం, రైతాంగం ఆగమవుతోందని ఆరోపించారు. మొన్న కేఎల్ఐ, శ్రీశైలం, నిన్న కాలేశ్వరం, ఇప్పుడు పాలమూరులో కార్మికులు చనిపోయినా సీఎంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులెవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు మేఘా కంపెనీ నుంచి రూ. 50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట టీపీసీసీ స్టేట్ఆర్గనైజింగ్ సెక్రెటరీ రంగినేని జగదీశ్వర్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు రాము యాదవ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతారావు, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మౌలాలి పాల్గొన్నారు.
నిజ నిర్ధారణ కమిటీ వేయాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పాలమూరు-–రంగారెడ్డిలో జరిగిన ప్రమాదంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థ, సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలన్నారు. 1979లో తీసుకొచ్చిన వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయకుండా, ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా, కార్మికులతో పని చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అత్యుత్సాహం కారణంగా కార్మికులు మరణించిన ప్రాంతాన్ని విజిట్ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, అశోక్, రామయ్య, రవి, దశరథం, మధు, నవీన్, నరసింహ, కృష్ణయ్య పాల్గొన్నారు.
మేఘాను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి
కార్మికుల చావుకు కారమైన మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు శ్యాం ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్కు వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ మేఘా కంపెనీ రూల్స్ విరుద్ధంగా రాత్రి వేళల్లో పనులు జరుపుతూ కార్మికుల చావుకు కారణమైందని మండి పడ్డారు. ఒక్కో ఫ్యామిలీకి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఆయన వెంటన జనసేన నాయకులు సాయినాథ్, బీంసాగర్, సురేందర్ పాల్గొన్నారు.