మున్సిపల్ ఆస్తి పన్నుల టార్గెట్​ రూ 5 కోట్లు.. వసూళ్లు 2.93 కోట్లు

మున్సిపల్ ఆస్తి పన్నుల టార్గెట్​ రూ 5 కోట్లు.. వసూళ్లు 2.93 కోట్లు
  • మున్సిపల్​ ఆస్తి పన్నుల వసూళ్లకు ఈనెలాఖరు డెడ్​ లైన్​
  • 100 శాతం వసూళ్ల పై ఆఫీసర్ల నజర్​ 
  • వడ్డీపై 90 శాతం రాయితీ చాన్స్​
  • టార్గెట్​ చేరడం కష్టమే!

జనగామ, వెలుగు : జనగామ మున్సిపల్​ ఆస్తి పన్నుల వసూళ్ల పై ఆఫీసర్లు నజర్​  పెట్టారు. వడ్డీ పై 90 శాతం రాయితీకి ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉండడంతో 100 శాతం వసూళ్లు జరిగేలా శ్రమిస్తున్నారు. మున్సిపల్​ సిబ్బంది ఇండ్లకు చేరుకుని టాక్స్​ పేమెంట్​ చేయాలని కోరుతున్నారు. 2023-–24 యేడాది టాక్స్​ టార్గెట్​ రూ 5 కోట్ల 17 లక్షలు ఉండగా ఇప్పటి వరకు 64 శాతం మాత్రమే వసూళ్లు చేశారు. మిగిలిన టార్గెట్​ రీచ్​ అయ్యేందుకు కసరత్తు  చేస్తున్నారు.

మొండి బకాయిలపై  దృష్టి

మున్సిపల్​ ఆదాయ వనరుల్లో పన్నుల వసూళ్లే కీలకంగా ఉన్నాయి. కానీ పట్టణ వాసుల్లో పలువురు తమ పన్నుల చెల్లింపులో ప్రతీ యేటా నిర్లక్ష్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది.   బకాయిల వసూళ్ల పై మున్సిపల్​ స్టాఫ్​ ప్రత్యేక దృష్టి పెట్టింది.  ఇటీవల ఓ అడ్తి వ్యాపారి నుంచి గతేడాది బకాయితో పాటు ప్రస్తుత బకాయి కలిపి రూ 2, 68,073 లను వసూలు చేశారు.

అదే విధంగా పట్టణానికి చెందిన ఓ ప్రముఖ లీడర్​   వ్యాపార సముదాయం నుంచి రూ 1,09,134 లను, ఓ విద్యా సంస్థ నుంచి 64,480లను వసూలు చేశారు. వీటితో పాటు ఆర్టీసీ పెండింగ్​ బకాయిలుగా ఉన్న రూ 3 లక్షల పై చిలుకు మొత్తాన్ని వసూలు చేశారు. వీటితో పాటుగా పెద్ద పద్దుల వసూళ్లకు సంబంధించి సదరు వ్యాపారులతో వడ్డీ రాయితీ పై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.

మిగిలింది పది రోజులే

జనగామ మున్సిపల్​ పరిధిలో లక్ష జనాభా దాటింది. కాలనీలు విపరీతంగా పెరుగుతున్నాయి.    దీంతో కొంత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలంటే మున్సిపల్​ ఆదాయం పెరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో దుకాణాలకు ట్రేడ్​ లైసెన్స్​లు జారీ చేయడం లేదన్న అపవాదు ఉంది. కనీసం  పన్నుల వసూళ్లు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ప్రతీ కౌన్సిల్​ మీటింగ్​ లో సభ్యులు తమ గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అయినా ప్రతీ యేటా బకాయిలు ఉండడం కామన్​ గా మారింది.

ఇదే క్రమంలో 2023-24 టార్గెట్​ రూ 5 కోట్ల 18 లక్షలు ఉండగా ఇందులో 2022-23కు సంబంధించిన పాత బకాయిలు రూ 2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ పై 90 శాతం రాయితీ ప్రకటించి స్పెషల్​ డ్రైవ్​ చేపడుతుండడంతో వసూళ్లు జరుగుతున్నాయి. వడ్డీ పై 90 శాతం రాయితీ తీసేస్తే రూ 4 కోట్ల 54 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ 2 కోట్ల 93 లక్షలు వసూలు ఆయ్యాయి. మున్సిపల్​ పరిధిలో మొత్తంగా పన్నులు వసూళ్లు చేసేందుకు 14,708 కమర్షియల్​, మిక్స్​డ్​ కమర్షియల్​, రెసిడెన్స్​ ఆస్థులు ఉన్నాయి.

వీటిలో కమర్షియల్​ 1010, మిక్స్​డ్​ కమర్షియల్ 1644, ఇండ్లు 12,054 గా ఉన్నాయి. వీటితో పాటు 7935 నల్లా కనెక్షన్​లు ఉండగా ప్రతీ నెల పన్నులు వసూళ్లు జరుగాల్సి ఉంది. కానీ ప్రతీ యేడాది మార్చిలోనే వసూళ్ల పై ఫోకస్​ ఉంటోంది. మిగతా నెలల్లో నామమాత్రంగా వసూళ్లు జరుగుతున్నాయి. దీంతో 100 శాతం వసూళ్ల టార్గెట్​ రీచ్​ కావడం కష్టంగా మారింది. ఈ సారైనా లక్ష్యం చేరుతారా లేదా అనేది మరో పది రోజుల్లో తేలనుంది.  

వసూళ్ల పై ప్రత్యేక దృష్టి 

ఆస్థి పన్నుల వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాం. వడ్డీ పై 90 శాతం రాయితీకి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు 64 శాతం పన్నుల ను వసూలు చేశాం. బకాయిల చెల్లింపు పై పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తున్నం. వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇండ్లు, కమర్షియల్​ కాంప్లెక్స్​ ల వద్దకు వచ్చే మున్సిపల్​ సిబ్బందికి సహకరించి పన్నులు చెల్లించాలి. మున్సిపల్​ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. పన్నులు సకాలంలో చెల్లిస్తే వసతుల కల్పినకు ఇబ్బంది ఉండదు. పట్టణ వాసులు వెంటనే తమ బకాయిలను చెల్లించాలి.

పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్​ కమిషనర్​, జనగామ