
- ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దరి అరెస్ట్
- తెలంగాణ ఇంటెలిజెన్స్,ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో
- హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్కు యత్నం
- విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు
- ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్నగరంలో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసింది. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. బ్లాస్టింగ్ ఎక్స్పర్మెంట్స్ కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని శనివారం అరెస్ట్ చేసింది. ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్(28)ను అదుపులోకి తీసుకొని, విజయనగరం పోలీసులకు అప్పగించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ పటిష్టమైన నిఘా పెట్టింది.
ఐసిస్తో లింకులు ఉన్నాయా?
ఐసిస్సహా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థల సానుభూతిపరులు, హ్యాండ్లర్ల ఆపరేషన్ల వివరాలను ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’(ఏహెచ్ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో ఉండే ఓ హ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నాయని తేల్చారు. బ్లాస్టింగ్స్ కోసం ఎక్స్పరిమెంట్స్ చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐసెల్కు సమాచారం అందింది.
దీంతో రాష్ట్ర సీఐ సెల్ అధికారులు అందించిన సమాచారంతో విజయనగరం పోలీసులు అప్రమత్తం అయ్యారు. సిరాజ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. సమీర్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి, విజయనగరం తరలించారు. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. కాగా 2018 లో సిరాజ్, సమీర్ కలిసి హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివారు. అప్పటి నుంచే వీరిద్దరూ ఐసిస్ వైపు ఆకర్షితులయ్యారు. హైదరాబాద్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని విజయనగరంలో కొనుగోలు చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లో డమ్మీ పేలుళ్లతో ఎక్స్పరిమెంట్ చేయాలనుకున్నారు.