
క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి ఇది. అప్పుడే పుట్టిన పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ వ్యాధి బారిన పడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కణాల్లో మెల్లగా మొదలై.. వేగంగా విస్తరిస్తూ.. తక్కువ సమయంలోనే డ్యామేజ్ చేసి మనుషులను హరిస్తోంది. వ్యాధి బాగా ముదిరాక బయటపడటం.. చాలా మందికి ఏ థెరపీ పనిచేయక ప్రాణాలు వదలటం చూస్తూనే ఉన్నాం. అయితే శాస్త్రవేత్తలు క్యాన్సర్ గురంచి గుడ్ న్యూస్ చెప్పారు.
ఇజ్రాయెల్, యూఎస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన ప్రయోగంలో.. ఒక పర్సన్ లుకేమియాకు గురయ్యే ఛాన్సెస్ ఎంత వరకు చెప్పే టెస్టును కనుగొన్నారు. నేచర్ మెడిసిన్ అనే జర్నల్ లో పబ్లిష్ అయిన ఆర్టికల్ లో .. ప్రస్తుతం ఉన్న టెస్టుల స్థానంలో ఈజీగా బ్లడ్ క్యాన్సర్ గుర్తించే టెస్టును డెవలప్ చేసినట్లు ప్రచురించారు. బోన్ మ్యారో (ఎముకలో ఉండే మజ్జ, మూలుగు ) ద్వారా క్యాన్సర్ పరీక్షలు చేసేవారు ఇప్పటి వరకు. సైంటిస్టులు డెవలప్ చేసిన టెస్టుతో ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చునని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ లోని వీజ్మన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు.. మయెలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ (MDS) అనే దానిపై పరిశోధన జరిపారు. ఈ MDS వలన ఎనీమియా వచ్చే అవకాశం ఉందని.. మయెలోడి లుకేమియా అనే క్యాన్సర్ కు దారితీస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం MDS ను గుర్తించేందుకు బోన్ మ్యారో ను పరీక్షించాల్సి వస్తోంది. అందుకోసం ఎనస్తీషియా (మత్తుమందు) ఇచ్చి ఎముకలోని మజ్జను బయటకుతీయాల్సి వస్తుంది. ఇది కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటుంది.
అయితే ప్రస్తుత పరిశోధనలో సైంటిస్టులు చాలా అరుదైన స్టెమ్ సెల్స్ ను గుర్తించారు. ఇవి బోన్ మ్యారో నుంచి రక్తంలోకి వస్తుంటాయి. ముందస్తుగా MDS వస్తుందా లేదా అనే కీలక సమాచారాన్ని బ్లడ్ లోకి మోసుకొస్తాయి. సింగిల్ సెల్ జెనెటిక్ సీక్వెన్సింగ్ ద్వారా.. బ్లడ్ సాంపుల్ నుంచి క్యాన్సర్ ప్రమాదం ఎంత మేరకు ఉందో.. ముందుగానే గుర్తించవచ్చు.
బ్లడ్ లో సర్క్యులేట్ అయ్యే ఈ స్టెమ్ సెల్స్.. వ్యక్తి వయసును బట్టి.. ఏ ఏ స్థాయిలో ఎంత వరకు సమస్య ఉందనే సమాచారాన్ని అందిస్తాయని, దీంతో క్లిష్టమైన బోన్ మ్యారో టెస్ట్ అవసరం లేకుండానే బ్లడ్ సాంపుల తో క్యాన్సర్ ను గుర్తించవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ సెల్స్ స్త్రీలలో కంటే పురుషులలో తొందరగా రూపాంతరం చెందుతాయని.. అందుకే పురుషులలో బ్లడ్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పేర్కొన్నారు.
బ్లడ్ క్యాన్సర్ తో పాటు ఈ టెస్టు ద్వారా వయసు రీత్యా వచ్చే రక్తసంబంధిత సమస్యలను గుర్తించవచ్చునని సైంటిస్టులు తెలిపారు. ఈ ప్రయోగం ఫలితాలు పెద్ద ఎత్తున సాంపుల్ సేకరించి.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సైంటిస్టులు కనుగొన్న ఈ టెస్టుతో మున్ముందు బ్లడ్ క్యాన్సర్ పరీక్షించడం, కనుక్కోవడం చాలా తేలిక అవుతుందని చెబుతున్నారు.