మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గణేశ్ మొబైల్స్ వ్యాపారులు కోట్లలో అప్పులు చేసి పరారయ్యారు. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి తోటి వ్యాపారులు, పలువురి వద్ద కోట్ల రూపాయలు అప్పులు చేసిన అన్నదమ్ములు రెండు నెలలుగా మొబైల్ షాపు మూసి వేసి కనిపించకుండా పోయారు. ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై వారం రోజుల కింద కోర్టు నుంచి పలువురికి నోటీసులు జారీ అయ్యాయి.
సదరు వ్యాపారులకు అప్పులు ఇచ్చిన వారు, బాధితులు ఎవరైనా ఉంటే తమ లావాదేవీల ఆధారాలను, పత్రాలను వెంటనే నమోదు చేయాలని ఆ నోటీసుల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి వస్తాయో? రావో? అని లబోదిబోమంటున్నారు. ఎన్ని కోట్ల రూపాయలకు ఐపీ పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారం మంచిర్యాలలో తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.
