కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వాస్తవానికి ఆయన ఈ రోజు (ఏప్రిల్ 20 ) గురువారం రోజున న్యూఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్కు హాజరు కావాల్సి ఉంది.
అయితే కరోనా బారిన పడటంతో ఆ ఈవెంట్కు దూరం అయినట్లు రాజ్నాథ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల బృందం అయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
దేశంలో కాస్త తగ్గుతున్నట్టుగా కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 19తో పోలిస్తే ఇవాళ ఏప్రిల్ 20 గురువారం రోజున కేసులు 20 శాతం పెరిగాయి. అంటే 2 వేలకు పైగా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 12 వేల 591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 65,286 కు చేరుకుంది. మరోవైపు 10 వేల 827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.