నచ్చిన కాలేజీలో నచ్చిన క్లాస్ వినొచ్చు

నచ్చిన కాలేజీలో నచ్చిన క్లాస్ వినొచ్చు
  • క్లస్టర్ సిస్టంలో క్లాసులు కామన్
  • ఒకటి రెండు రోజుల్లో గైడ్ లైన్స్ విడుదలయేయ్ చాన్స్
  • పేరెంట్ల అనుమతి ఉంటేనే స్టూడెంట్లకు పర్మిషన్
  • పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 9 డిగ్రీ కాలేజీల ఎంపిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో క్వాలిటీని పెంచేందుకు నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీలో భాగంగా తీసుకొచ్చిన క్లస్టర్ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. దీని అమలుకు సంబంధించి ఇప్పటికే గైడ్​లైన్స్ ​రూపొందించిన ఆఫీసర్లు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. పైలెట్​ ప్రాజెక్ట్​ కింద హైదరాబాద్​లోని 9 అటానమస్ డిగ్రీ కాలేజీలను ఎంపిక చేశారు. క్లస్టర్​ ఎంఓయూ కుదుర్చుకునే కాలేజీల్లో కామన్ టైమ్ టేబుల్, ఎగ్జామ్స్, క్రెడిట్స్ విధానం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఏంటీ క్లస్టర్​విధానం..
క్లస్టర్ ​పరిధిలోని  డిగ్రీ కాలేజీల్లో ఒక స్టూడెంట్ ​తనకు నచ్చిన క్లాస్.. నచ్చిన కాలేజీలో నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర వినొచ్చు. తరగతులతోపాటు ల్యాబ్, లైబ్రరీ, గ్రౌండ్, ఫ్యాకల్టీని ఎక్సెంజ్ చేసుకునే చాన్స్​ ఉంటుంది. ​సబ్జెక్ట్​పై స్టూడెంట్ పూర్తి పరిజ్ఞానం సాధించడానికి ఈ విధానం ఎంతో మేలు చేయనుంది. ఒక్కో సబ్జెక్టులో 30 నుంచి 60 మంది స్టూడెంట్లకు పర్మిషన్ ఇస్తారు. ఒక స్టూడెంట్ ఒక సెమిస్టర్ వరకు ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకునేందుకు అవకాశమివ్వనున్నారు. ఈ ఏడాది డిగ్రీ సెకండ్​ఇయర్​లో దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ విధానం ఢిల్లీతో పాటు జమ్మూకాశ్మీర్​లో అమలవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. 

ఎంపిక చేసిన కాలేజీలు
హైదరాబాద్​లోని కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాంకాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్, రెడ్డి ఉమెన్స్, సెయింట్‌‌ ఆన్స్‌‌ కాలేజీ మెహిదీపట్నం, సెయింట్‌‌ ఫ్రాన్సిస్‌‌ బేగంపేట, భవన్స్‌‌ కాలేజీ, లయోలా అకాడమీ కాలేజీలను క్లస్టర్ విధానానికి ఎంపిక చేశారు.

పేరెంట్స్​అనుమతి..
క్లస్టర్​విధానం అమలుకు సంబంధించి ఇప్పటికే అకడమిక్, అడ్మినిస్ర్టేషన్, జనరల్ తదితర అంశాల​పై ఉన్నత విద్యామండలి కమిటీ వేయగా, ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. అయితే క్లస్టర్ విధానం మేరకు డిగ్రీలో చేరే స్టూడెంట్లు వారి పేరెంట్స్​ నుంచి అనుమతి పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు కాలేజీ, యూనివర్సిటీతో పాటు రాష్ట్రస్థాయిలోనూ కమిటీ వేయాలని నిర్ణయించారు.  వచ్చే ఏడాది మరిన్ని కాలేజీల్లో ఈ విధానం అమలు చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెప్తున్నారు.