మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు మన స్టూడెంట్లను అప్డేట్ చేసేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని కాలేజీల్లో ఇకపై లెక్చరర్లతోనే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోనూ పాఠాలు చెప్పించేందుకు రెడీ అవుతోంది. కొత్త కోర్సుల్లో ఏఐ ట్యూటర్ల ద్వారా క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా, కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులకు సంబంధించిన బోధనలో ఏఐని భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా విద్యార్థులకు క్లాసులు చెప్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
అన్ని కోర్సుల్లోనూ ఏఐ
ఇప్పటిదాకా ఇంజినీరింగ్ చదివే వాళ్లకే ఏఐ అనే విధానానికి స్వస్తి పలకనున్నది. ఏఐ అక్రాస్ కరికులం పేరుతో డిగ్రీ, పీజీ చదివే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, అగ్రికల్చర్, లా స్టూడెంట్లకు కూడా ఏఐ సాయంతో పాఠాలు చెప్పనున్నారు. ప్రతి కోర్సులోనూ ఏఐకి సంబంధించిన చాప్టర్లను చేరుస్తారు. మన వర్సిటీలను కేవలం పాఠాలు చెప్పే సెంటర్లుగానే కాకుండా.. వ్యవసాయం, హెల్త్, వాతావరణం వంటి సమస్యలకు పరిష్కారం చూపే ఇన్నొవేషన్ హబ్లుగా మారాలన్నది కౌన్సిల్ ఆలోచన. దీనికోసం వర్సిటీల్లోనే ప్రత్యేకంగా ఏఐ రీసెర్చ్ పార్కులు, ల్యాబ్లు ఏర్పాటు చేసి స్టూడెంట్లను ప్రాక్టికల్ నాలెడ్జ్ వైపు మళ్లించేలా యోచిస్తున్నారు.
