
హైదరాబాద్, వెలుగు: రానున్న విద్యాసంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు మూడు విడతల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గతంలో ఐదారు విడతల్లో అడ్మిషన్స్ ప్రక్రియ నిర్వహించిన విద్యా మండలి పలు సమస్యలు ఎదురవడంతో శుక్రవారం జేఎన్ఏఎఫ్ఏ వర్సిటీలో జరిగిన దోస్త్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా గతంలో విద్యార్థులు అప్లై చేసుకున్నప్పుడు ఎదురైన సమస్యలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం మీ-సేవ ద్వారా 64 శాతం మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే, హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా కేవలం ఐదుశాతం మందే అప్లై చేసుకున్నారని లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 60 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా దరఖాస్తు చేసుకునేలా స్టూడెంట్స్కు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఆధార్ లింకేజీ కోసం బయోమెట్రిక్తో పాటు ఐరిస్ మిషన్లనూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అప్లై చేసుకున్నప్పటి నుంచి స్టూడెంట్లకు సమాచారాన్ని మొబైల్కు మెసేజ్ ఇవ్వడంతో పాటు వాట్సాప్కు, మెయిల్కూ వివరాలు సెండ్ చేస్తామన్నారు. గతంలో ఎన్ని విడతల్లో అప్లై చేసినా.. ఒకే ఓటీపీ ఉండేదనీ, కానీ వచ్చే విద్యాసంవత్సరం అప్లై చేసిన ప్రతిసారి కొత్త ఓటీపీ కేటాయిస్తామన్నారు. కాలేజీల్లోనే అప్లికేషన్స్లో ఎడిట్కు అవకాశం కల్పిస్తామన్నారు.