
- పలుచోట్ల బిల్లులు సకాలంలో అందక నిలిచిపోయిన వర్క్స్
- ఇప్పటికే పాఠశాలల పున:ప్రారంభం
- మౌలిక వసతులు లేక విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
- పెండింగ్పనులు వెంటనే పూర్తి చేయాలంటున్న ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలకు కొత్తరూపు తీసుకువచ్చేందుకు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ)లను ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులను పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. పనుల నిర్వహణ బాధ్యతలను ఆయా కమిటీలకు అప్పగించింది. సకాలంలో బిల్లులు మంజూరుకాకపోవడంతో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో పనులు ఈ ఏడాది విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు.
మానుకోట జిల్లాలో..
జిల్లాలో మొత్తం 922 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 438 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ)లకు ఎంపిక చేశారు. ఇందుకోసం రూ.1,242.01 లక్షల నిధులు మంజూరవగా, ఇప్పటి వరకు రూ.81.15 లక్షలు విడుదలయ్యాయి. 12 పాఠశాలలు ఖర్చుల వివరాలు తెలుపనివి ఉన్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన 438 పాఠశాలల్లో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పాఠశాల హెచ్ఎంలతో జాయింట్ బ్యాంకు ఖాతాలను తెరిచారు.
ప్రతిపాదించిన పనులను ప్రారంభించేందుకు నిబంధనల మేరకు అవసరమైన నిధులను తొలుత 25 శాతం వరకు విడుదల చేశారు. ఆ తర్వాత పనులు ప్రగతిని బట్టి ఇస్తున్నారు. అనేక చోట్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైనా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు.
బిల్లులు రాకపోవడంతో జాప్యం..
చిన్నగూడూరు గ్రామ శివారు చేపూరి తండా పాఠశాలలో రూ.3.80 లక్షలతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. నీటి సౌకర్యం, తలుపుల ఫిటింగ్ జరగలేదు. కురవి మండలం తిరుమలాపురం ప్రాథమిక పాఠశాలలో రూ.1.90 లక్షలు మంజూరుకాగా, మరుగుదొడ్ల మరమ్మతులు, నీటి ట్యాంకు, పైపుల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. రూ.1.15 లక్షలు మాత్రమే అందాయి.
నర్సింహులపేట మండలం బస్తారాంతండా ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.1.70 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఏడాది గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. దంతాలపల్లి పీఎస్ స్కూల్లో కిచెన్షెడ్పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తొర్రూరు హైస్కూల్లో టాయిలెట్స్, అడిషనల్ గదుల పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇలా పనులు పాఠశాలల్లో పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.
పెండింగ్పనులు పూర్తి చేయాలి
జిల్లాలో ఏఏపీసీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు నిధుల కొరత పెద్దగా లేదు. కొన్ని పాఠశాలల నుంచి పనులు పూర్తికి సంబంధించిన వివరాలు ఇంజినీరింగ్ శాఖ అధికారులకు సకాలంలో అందించకపోవడంతో కొంత జాప్యం జరుగుతుంది. ఆఫీసర్లు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వీలైనంత మేర పనులను కంప్లీట్చేయాలని ఆదేశించాం.
రవీందర్రెడ్డి, డీఈవో, మహబూబాబాద్ జిల్లా