![అమిత్షాకు మోదీ రూట్క్లియర్ చేస్తున్నరు: కేజ్రీవాల్](https://static.v6velugu.com/uploads/2024/05/delhi-cm-arvind-kejriwal-said-that-there-is-a-succession-war-going-on-in-bjp_hJ1S5uMVka.jpg)
న్యూఢిల్లీ: బీజేపీలో వారసత్వ యుద్ధం జరుగుతోందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తన వారసుడిగా అమిత్ షాకు మార్గం సుగమం చేస్తున్నారని తెలిపారు. అందుకోసమే పెద్ద నాయకులందరినీ తొలగించారని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీలో 75 ఏండ్లు పైబడినవారందరినీ రిటైర్ చేస్తున్నామని, ఇందులో రాజీపడేది లేదని 2019లో అమిత్షా ప్రకటించారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
75 ఏండ్లు దాటిన వారికి పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు” అని తెలిపారు. ఈ నిబంధన ప్రకారం.. అద్వానీ, జోషి, సుమిత్రా మహాజన్ రిటైర్ అయ్యారని చెప్పారు. ఇదే తరహాలో శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధర రాజే, మనోహర్లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ ఇలా ఒక్కొక్కరినీ మోదీ పక్కనబెడుతున్నారని తెలిపారు. ఇప్పుడు యూపీ సీఎం యోగీని కూడా ఇలాగే పక్కన బెడతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ఇదంతా అమిత్షాకు లైన్క్లియర్చేసేందుకేనని కేజ్రీవాల్ఆరోపించారు.