ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన ఫర్నిచర్, రికార్డ్స్

ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన ఫర్నిచర్, రికార్డ్స్

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండో అంతస్తులో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం 5:58 గంటల ప్రాంతంలో రెండో అంతస్తులోని టీచింగ్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. కానీ కొంత ఫర్నిచర్, డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది.
 
ఏడు అగ్ని మాపక వాహనాలను సంఘటనా స్థలానికి పంపించి మంటలను ఆర్పినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. ఎయిమ్స్‌లోని డైరెక్టర్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఫర్నిచర్, ఫ్రిజ్, ఆఫీసు రికార్డులు కొన్ని మంటల్లో కాలిపోయాయని సమాచారం. ఈ ఘటనలో అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ కాకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ఈ అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.