న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. భార్యను చూసేందుకు మాత్రం సిసోడియాకు మళ్లీ చాన్స్ఇచ్చింది. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. అందు కోసం 6 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై ఇప్పటికే వాదనలు ముగియగా.. జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ సోమవారం తీర్పు ఇచ్చారు. ‘‘సిసోడియాపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో పని చేశారు. ఒకవేళ సిసోడియా బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వలేం” అని పేర్కొన్నారు.
భార్యను చూడొచ్చు..
సిసోడియా భార్య హెల్త్ కండీషన్ రిపోర్టును పరిగ ణనలోకి తీసుకున్న కోర్టు.. ఆస్పత్రిలో గానీ, ఇంట్లో గానీ ఏదో ఒక రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వెళ్లి కలవొచ్చని చెప్పింది. అయితే ఆ సమయంలో కుటుంబసభ్యులు మినహా మరెవరితోనూ మాట్లాడొద్దని.. ఫోన్, నెట్ వాడొద్దని ఆదేశాలు ఇచ్చింది.